తిరుమలకు అంత ఖ్యాతి ఎందుకు వచ్చిందో తెలుసా?: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఎంత గొప్ప దేవుడు కొలువై ఉన్నా ఆలయాల్లో శుభ్రత లేకుంటే ఆధ్యాత్మిక భావన కలగదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టి రెండేళ్లు కావస్తున్న సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జాతీయ స్వచ్ఛతా సదస్సు 'ఇండోశాన్'ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పరిశుభ్రతకు తిరుమల మారుపేరని అన్నారు. ''ఓసారి తిరుపతి వెళ్లి చూడండి. దారులు ఎంతో అందంగా ఉంటాయి. ఆహ్లాదకర వాతావరణం, పరిశుభ్రత మనసును దోచుకుంటాయి'' అన్నారు. తిరుమల, వైష్ణోదేవి ఆలయాలకు అంతటి పేరు ప్రఖ్యాతులు రావడానికి అక్కడి పరిశుభ్రతే కారణమని చెప్పారు.
పరిశుభ్రత మన ఆధ్యాత్మికతలో చేరింది
పురాతన కాలం నుంచే పరిశుభ్రత మన ఆధ్యాత్మికతలో చేరిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తిరుమల, వైష్ణోదేవి ఆలయాల్లో పరిశుభ్రతకు విలువనిచ్చారు కాబట్టే వాటికి అంతటి ఖ్యాతి లభిస్తోందని అన్నారు. కాబట్టి అన్ని ప్రార్థనా మందిరాలకు చుట్టూ ఒకటి రెండు కిలోమీటర్లు పరిశుభ్రంగా తయారుచేయాలని సూచించారు.
ప్రసాదంతోపాటు పరిశుభ్రతకు సంబంధించిన పత్రాలను పంపిణీ
ఆలయాలకు వచ్చిన భక్తులకు ప్రసాదంతోపాటు పరిశుభ్రతకు సంబంధించిన పత్రాలను కూడా పంపిణీ చేయాలని సూచించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ సత్యాగ్రహాన్ని ప్రారంభించినట్టు మనం పరిశుభ్ర భారత్ కోసం స్వచ్ఛాగ్రహానికి నడుంబిగించాలని అన్నారు.
దేశం 2019 నాటికి సంపూర్ణ పరిశుభ్రత సాధిస్తుంది
దేశం 2019 నాటికి సంపూర్ణ పరిశుభ్రత సాధిస్తుందనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ స్వచ్ఛత దిశగా వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న చర్యలు ఎంతో బాగున్నాయని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పట్టణాలను బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా చేస్తున్నామని ఆయన చెప్పారు.
విజయవాడ నుండి దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభం
విజయవాడ నుండి దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభం కావటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆక్రమిత కాశ్మీర్లో భారత సైన్యంతో సర్జికల్ దాడులు చేయించిన మోడీ పట్ల దేశం గర్వపడుతోందన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్లో పాల్గొన్న సైనికులను ఆయన కొనియాడారు.
మంత్రి నారాయణపై ప్రశంసలు కురిపించిన చంద్రబాబు
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఓడిఎఫ్ సాధించాయనీ, వారంతా కష్టపడి పని చేశారనీ ఆయన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణపై ప్రశంసలు కురిపించారు. ఓడిఎఫ్ వలన దేశానికి ఎంతో మేలు జరుగుతుందనీ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.