బాబు ముందు ఎత్తులు చిత్తు: జగన్ చాలనకున్నారు కానీ, అందుకే రంగంలోకి రోజా?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం, ఆదివారం నంద్యాలలో పర్యటించనున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇప్పటికే వైసిపి అధినేత వైయస్ జగన్ నంద్యాలలో తిష్టవేశారు.
నంద్యాల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం, ఆదివారం నంద్యాలలో పర్యటించనున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇప్పటికే వైసిపి అధినేత వైయస్ జగన్ నంద్యాలలో తిష్టవేశారు.
చదవండి: వైసిపిలో ఉన్నప్పుడు జగన్ పట్టించుకోలేదు, ఆశ్చర్యం లేదు: హెచ్చరికపై బాబుకు జ్యోతుల సూచన
టిడిపి తరఫున బాలకృష్ణ, నారా లోకేష్ వచ్చారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారు. నంద్యాల ప్రచారంలో జగన్ వ్యాఖ్యలను ఇప్పటికే టిడిపి నేతలు తిప్పు కొడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబు అజెండా ఏమిటి
దీంతో ఇప్పటికి దాక జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నిర్వహించే ప్రచారం మరోక ఎత్తు. అయితే నంద్యాల ప్రచారంలో చంద్రబాబు అజెండా ఏమిటీ అనే అంశంపై అంతటా చర్చ సాగుతోంది.
సింగిల్ పాయింట్ అజెండానా?
అలాగే, అభివృద్ధి విషయంలో ఈ మూడేళ్ల పాలన చేపట్టిన పనులపై చంద్రబాబు ఏం చెబుతారు? నంద్యాలలో సీఎం సింగిల్ పాయింట్ ఎజెండా ఇదేనా? అంతేకాదు చంద్రబాబు చేపట్టిన అబివృద్ధి పనులకు నంద్యాల ఒక లిట్మస్ టెస్టుగా టిడిపి నేతలు భావిస్తున్నారు. అధికారం చేపట్టిన తర్వాత మూడేళ్ల కాలంలో రాజకీయ అంశాల జోలికి పోకుండా కేవలం అభివృద్ధి పైనే చంద్రబాబు ఫోకస్ పెట్టారు.
నంద్యాల పరిస్థితి వేరు
రాజకీయాలు ఎన్నికల సమయంలో చూసుకుందామని పదేపదే చెబుతూ వస్తున్నారు. తనను ఎదుర్కొనే స్థాయి జగన్కు లేదని తనకు ప్రత్యర్థి కూడా కాదని చంద్రబాబు అంటున్నారు. ఈ మూడేళ్లలో ఏ ఎన్నికలు వచ్చినా నంద్యాల పరిస్థితి వేరు.
వైసిపిని టార్గెట్ చేస్తారా?
పైగా ఈ ఎన్నికలను మేజర్ ఎన్నికలుగా టిడిపి, వైసిపిలు భావిస్తున్నాయి. జగన్ తన ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని నొక్కి చెబుతున్నారు. అందుకే నంద్యాల ఎన్నికల ప్రచారానికి వస్తున్న చంద్రబాబుపై అందరి దృష్టి ఉంది. అభివృద్ధి రాజకీయాలతో జగన్ విమర్శలకు చెక్ చెబుతారా? ముళ్లు ముళ్లుతోనే తీయాలన్నట్లు వైసిపిటార్గెట్ చేస్తారా? అనే చర్చ సాగుతోంది. అయితే, ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో జగన్ను టార్గెట్ చేసే పరిస్థితి ఉందంటున్నారు.
బాబు ముందు జగన్ ఎత్తులు చిత్తు!
నంద్యాల కోటను కైవసం చేసుకునేందుకు చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహాలకు వైసిపి దిమ్మతిరుగుతోందంటున్నారు. ఓ వైపు పాలనాపరంగా చంద్రబాబు బిజీగా ఉన్నప్పటికి దృష్టిని నంద్యాలపై పెట్టారు. 9 తేదీ నుంచి నంద్యాలలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్న జగన్ ఎత్తులకు అడుగడునా చెక్ పెడుతున్నారని అంటున్నారు.
జగన్ వస్తే చాలనుకున్నారు కానీ
జగన్ పగలు రోడ్డు షోలు, రాత్రి తన బృందంతో రహస్య భేటీలు నిర్వహిస్తూ రోజురోజుకు ప్రచారానికి పదునుపెట్టే పని చేస్తున్నారు. ఆయన నంద్యాలలోనే ఉంటే వైసిపి గెలుపు సులభమని చాలామంది భావించారని, కానీ చంద్రబాబు పదునైన వ్యూహాలకు వైసిపి బలహీనపడి, టిడిపి పుంజుకుందని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.
వైసిపి గ్రాప్ పడిపోవడంతోనే రంగంలోకి రోజా!
వైసిపి గ్రాఫ్ పడిపోతుందని గుర్తించే ఎమ్మెల్యే రోజాను తీసుకు వచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో హీరో బాలకృష్ణ రావడం, గంగుల ప్రతాప్ రెడ్డి టిడిపిలో చేరడం.. ఇలా వ్యూహాత్మకంగా టిడిపి ముందుకు వెళ్తోందని అంటున్నారు. ఇప్పుడు సీఎం ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు.
శిల్పా, రోజా వ్యాఖ్యలతో నష్టం
శిల్పా చక్రపాణి రెడ్డి, రోజా వ్యాఖ్యలతో ఇమేజ్ దెబ్బతినడంతో ఆ అంశాల నుంచి జనం దృష్టి మళ్లించడానికి జగన్ కూడా అభివృద్ధి పల్లవి అందుకున్నారని అంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ తటస్థంగా ఉండటం మాత్రం టిడిపికి నష్టమే అంటున్నారు.