హోదా ఇస్తామన్నారే గానీ, నా కష్టానికి ఫలం, వారి కాళ్లు మొక్కాలి: చంద్రబాబు
అమరావతి: ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ గురువారం తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం, పోలవరంకు వంద శాతం నిధులు ఇచ్చినందుకు ప్రధాని మోడీకి, కేంద్రమంత్రులు ఉమాభారతి, అరుణ్ జైట్లీ, సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులకు ధన్యవాదాలు తెలిపారు.
మనకు కట్టే సామర్థ్యం ఉందనే
పోలవరానికి మూడేళ్లలో రూ.3,541 కోట్లు ఖర్చు పెట్టామని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం కడతామంటే ఆనందంగా ఇస్తామని చెప్పామన్నారు. కానీ మనకు కట్టే సామర్థ్యం ఉందనే అప్పగించారని చెప్పారు.
హోదాకు సమానమైన ప్యాకేజీ
ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించినందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. హోదాతో వచ్చిన వాటిని ప్రత్యేక ప్యాకేజీలో ఇస్తామని కేంద్రం చెప్పిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో విపక్షాలకు చిత్తశుద్ధి లేదన్నారు.
నాకు పదవే వద్దని చెప్పా
ఏడు మండలాలు ఏపీకి రాకుంటే పోలవరం ముందుకు కదిలేది కాదని చెప్పారు. పోలవరానికి వంద శాతం నిధులు ఇస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు అన్నారు. పోలవరం కోసం మండలాలు కలవకుంటే పదవే అవసరం లేదని చెప్పానన్నారు.
మండలాలు ఇచ్చేదాకా ప్రమాణ స్వీకారం చేయనని చెప్పా
తెలంగాణలోని ఏడు మండలాలు ఇవ్వకుంటే ప్రమాణ స్వీకారం చేయనని ప్రధాని మోడీకి చెప్పానని అన్నారు. పోలవరం ఎలా పూర్తి చేస్తామనే విషయాన్ని నాటి యూపీఏ ప్రభుత్వం చట్టంలో పెట్టలేదన్నారు.
వారికి ఇస్తే పనులు త్వరగా పూర్తి కావు
జాతీయ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చీఫ్ ఇంజినీర్ చూసుకుంటారని చంద్రబాబు చెప్పారు. వారికి అప్పగిస్తే పనులు వేగంగా పనులు పూర్తి కాకపోయేవని చెప్పారు. తాను స్వయంగా 14సార్లు పోలవరం ప్రాజెక్టును పరిశీలించానని చెప్పారు. 18సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వారా పర్యవేక్షించానని తెలిపారు. ప్యాకేజీకి చట్టబద్దత, పోలవరానికి వంద శాతం నిధులు కేంద్రం ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు.
41 శాతం పనులు పూర్తి
పోలవరం పనులు 41 శాతం పూర్తయ్యాయని చెప్పారు. దీని నిర్మానం నా పూర్వ జన్మ సుకృతం అన్నారు. 2018 నాటికి గ్రావిటీ నీళ్లు తేవాలని ఉక్కు సంకల్పం చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 16వేల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పారు. రెవెన్యూ లోటు కింద కేంద్రం మూడు విడతలుగా నిధులు ఇచ్చిందని చెప్పారు.
హోదా ఇస్తామని చెప్పారు కానీ..
విభజన జరిగిన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామమని యూపీఏ ప్రభుత్వం చెప్పిందని, కానీ ఏం ఇస్తుందో చెప్పలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, నిర్వాసితులకు న్యాయసమ్మతంగా పరిహారం ఇస్తున్నామని చెప్పారు.
2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. డబ్బు ఉంది.. ఉక్కు సంకల్పం ఉంది... పోలవరంను పూర్తి చేస్తామని చెప్పారు.
రైతుల చొరవ వల్లే ఇక్కడ.. విశాఖకు రైల్వే జోన్ కూడా..
మనం రైతుల చొరవ వల్లే ఇక్కడ (అసెంబ్లీ, అమరావతి)లో ఉన్నామని చంద్రబాబు చెప్పారు. రాజధాని కోసం రైతులు నమ్మకంతో 33వేల ఎకరాలు భూమి ఇచ్చారని తెలిపారు. రైతులు చేసిన త్యాగాలకు వాళ్లు కాళ్లు మొక్కాల్సి ఉందన్నారు. విశాఖకు రైల్వే జోన్ రావాల్సి ఉందన్నారు. అది విశాఖకే వస్తుందన్నారు. శాసన సభ స్థానాలు కూడా 225కు పెరుగుతాయని, సభ నిండుగా ఉంటుందన్నారు.
నా కష్టానికి ఫలం..
ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత, పోలవరం నిధులు తన కష్టానికి, తన తిరుగుడుకు (ఢిల్లీ ప్రయాణాలు) ఫలం అన్నారు. ఫలితం దక్కినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును కచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పారు. ప్యాకేజీ ఇచ్చినందుకు, పోలవరంకు నిధులు ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూనే... మనకు రావాల్సిన వాటిని సాధించుకుందామన్నారు. వీటిని సాధించినందుకు తనకు గర్వకారణంగా ఉందన్నారు.