జపాన్ చేరుకున్న బాబు బృందం: ఏపీ గురించి ఏం చెప్తారు?
హైదరాబాద్: జపాన్ పర్యనటలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం టోక్యో చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి 1 గంటకు హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరిన చంద్రబాబు బృందం ఆదివారం మధ్యాహ్న ప్రాంతంలో జపాన్కు చేరుకున్నారు.
జూలై 6 నుంచి 8 వరకు పలు కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు బృందం సమావేశం కానుంది. తొలి రోజైన సోమవారం ఫ్యుజి ఎలక్ర్టికల్స్, మిత్సుబిషి కార్పొరేషన్, మయేకవా, యొకహోమా పోర్ట్, సుమిటోమో కార్పొరేషన్, నెక్సీ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తారు.
అదే రోజు భారత రాయబారితో విందులో పాల్గొంటారు. ఇక మంగళవారం మిజుహో, సాఫ్ట్బ్యాంకుల ప్రతినిధులు, జపాన్ ఆర్థికశాఖ మంత్రితో సమావేశమవుతారు. ఈ సమావేశాల్లో కీలక ఒప్పందాలను ఏపీ ప్రభుత్వం కుదుర్చుకోనుంది.
ఇక జపాన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంశంపై ఎన్ఈసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏపీలో స్మార్ట్సిటీల నిర్మాణంలో ఆర్కిటెక్చర్ సొల్యూషన్గా ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.
జపాన్లోని ప్రవాస భారతీయలుతో చంద్రబాబు బృందం భేటీ అవుతుంది. ఈ భేటీలో ఏపీ రాజధానిలో పెట్టుబడులు పెట్టేలా వారిని ఆహ్వానించనున్నారు. జపాన్ వాణిజ్య మంత్రితో కూడా చంద్రబాబు బృందం సమావేశం కానుంది.
ఏపీ రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని జపాన్ ప్రధాని షింజో అబేని ఆహ్వానించనున్నారు. జులై 8వ తేదీ వరకు చంద్రబాబు బృందం జపాన్లోనే పర్యటిస్తుంది. ఆ తర్వాత 9,10 తేదీల్లో హాంకాంగ్లో హాంకాంగ్లో పర్యటిస్తుంది.
హాంకాంగ్ నుంచి 10వ తేదీ రాత్రి బయల్దేరి హైదరాబాద్కు తిరిగి రానున్నారు. ఈ బృందంలో చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ పలువురు ఐఏఎస్ అధికారులు ఉన్నారు.