నేను సవాల్ విసురుతున్నా..: పవన్ కళ్యాణ్కు బాబు, జగన్ సభ్యతపై..
ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, పోలవరానికి పూర్తి నిధులు కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిన సందర్భంగా ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టారు.
అమరావతి: ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, పోలవరానికి పూర్తి నిధులు కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిన సందర్భంగా ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ప్రతిపక్ష వైసిపిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో తమకు సహరించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు సూచనతో పాటు సవాల్ చేశారు.
రాష్ట్ర అభివృద్ధి విషయంలో విపక్షాలకు చిత్తశుద్ధి లేదని వైసిపిని ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. పండగలు, చావు ఏవీ ప్రతిపక్షానికి లేవని మండిపడ్డారు. చంద్రబాబు మాట్లాడుతుండగా విపక్షాలు నిరసన తెలిపాయి.
దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు నోరు ఉంది కదా అని మాట్లాడుతారని, మీకు హుందాతనం లేదన్నారు. రాజ్యాంగంపై, ముఖ్యమంత్రిపై, స్పీకర్పై దేనిపైనా నమ్మకం లేదన్నారు. మీరు చెప్పిందే చేస్తామంటే కుదరదన్నారు.
సభ్యత గురించి..
శాసనంలో రాసిపెట్టిందే అనుసరించాలన్నారు. సభ్యత లేని సభ్యుల గురించి మాట్లాడటం వృథా అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓపిక పడుతున్నామని చెప్పారు. సభ్యత లేని వ్యక్తులతో సభ్యతగా ఉండాలని తమ ఎమ్మెల్యేలకు సూచించానని చెప్పారు.
నేనే పూర్తి చేస్తా..
ఒక్కపూట అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటారని, మరి కడుపునిండా అన్నం పెట్టే పోలవరం ప్రాజెక్టు కడుతుంటే అడ్డుకుంటారా అని వైసిపిపై చంద్రబాబు ఊగిపోయారు. వెలిగొండ ప్రాజెక్టును నేనే ప్రారంభించానని, నేనే పూర్తి చేస్తానన్నారు. ప్రతిపక్షాలు అడ్డదిడ్డంగా మాట్లాడటం దారుణం అన్నారు.
పవన్ కళ్యాణ్కు సూచన..
ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని, భారీగా నిధులు వస్తాయని కొందరు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. హోదాతో ఉద్యోగాలు, నిధులు వస్తాయని వైసిపితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెబుతున్నారు.
హోదాతో ఏదేదో జరుగుతుందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తాను పెద్దగా చదువుకోలేదని కొందరు అంటారని, కానీ నేను కూడా చిన్న యూనివర్సిటీలో.. ఎస్వీలో చదివానని చంద్రబాబు అన్నారు.
నేను సవాల్ విసురుతున్నా..
హోదాతో చాలా ఉంటాయనే వారికి తాను సవాల్ విసురుతున్నానని, ఇప్పటి దాకా దశాబ్దాలుగా హోదా ఉన్న రాష్ట్రాలకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు. హోదా ఉన్న రాష్ట్రాలకు ఏదైనా లాభం జరిగిందా చెప్పాలన్నారు.
మోడీకి విజ్ఞప్తి
ప్రధాని మోడీకి, కేంద్రానికి కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విభజనతో మాకు అన్యాయం జరిగిందని, కట్టుబట్టలతో వచ్చామని చంద్రబాబు అన్నారు. మాకు కేంద్రం సహకరించాలని అన్నారు. చలివేంద్రం పెట్టినా ధన్యవాదాలు తెలుపుతారని, ఏపీకి జీవనాడి అయిన పోలవరంకు నిధులు ఇస్తే ధన్యవాదాలు చెప్పవద్దా అని చంద్రబాబు ప్రశ్నించారు.