జపాన్ మెట్రో రైలులో బాబు: నవ్యాంధ్రకు రానున్న తోషిబా, హోండా..!
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు జపాన్ పర్యటనలో భాగంగా రాజధాని టోక్యోలో మెట్రో రైలులో ప్రయాణించారు. షింబసీ స్టేషన్ నుంచి షింటో యొసు స్టేషన్ వరకు రైల్లో ప్రయాణించారు. మెట్రో రైలెక్కిన చంద్రబాబు డ్రైవర్ పక్కనే కూర్చుని ఎత్తయిన భవనాలు, రహదారులు, అక్కడి మౌలిక వసతులు పరిశీలిస్తూ, 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు.
కాస్త వింతగా కనపడిన భవనాల వివరాలు, వంతెనల గురించి అడిగి తెలుసుకున్నారు. టోక్యోలో 2020లో ఒలింపిక్స్ జరిగే ప్రాంతాన్ని చంద్రబాబు బృందం సందర్శించింది. అనంతరం తోషిబా కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో నష్టాలను 10.3శాతం వరకు తగ్గించినట్లు సీఎం వివరించారు. త్వరలో ఏర్పాటు చేయనున్న ఎనర్జీ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని కోరారు. విశాఖపట్నం కేంద్రంగా గ్రిడ్పై పని చేయాలని తోషిబా ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు.
అందుకు తోషిబా సైతం అంగీకరించినట్టు తెలుస్తోంది. ఏపీలోని విద్యుత్ నిర్వహణపై తోషిబా ప్రతినిధులు ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. స్టార్ట్మీటర్లు, స్మార్ట్ పవర్ మేనేజ్మెంట్పై తోషిబా ప్రతినిధులు చంద్రబాబు బృందానికి ప్రజెంటేషన్ ఇచ్చారు.
అంతక ముందు చంద్రబాబు బృందం హోండా ప్రతినిధులతో సమావేశమైంది. హోండా వాహన తయారీ ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేస్తే అందుకు అవసరమైన అన్ని వసతులు, ఏర్పాట్లను చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
దీనిపై హోండా ప్రతినిధి బృందాన్ని ఏపీకి పంపుతామని చెప్పినట్టు అధికారులు తెలిపారు. అంతకు ముందు చంద్రబాబు బృందం జేబీసీ కార్పోరేషన్తో సమావేశమయ్యారు. ఏపీలోని పుడ్ ప్రాసెసింగ్ రంగంవైపు జేజీసీ ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. చంద్రబాబు వెంట రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడుతో పాటు దౌత్యాధికారులు, జపాన్ బృందం కూడా ఉంది.