కేసీఆర్, జగన్లపై చంద్రబాబు నిప్పులు, ఒక్కర్నీ వదలనని సవాల్
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిపై తేల్చుకునేందుకు తాను సిద్ధమని సవాల్ చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారు చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. మహానాడులో ఆయన బుధవారం ప్రారంభోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రం విడిపోయినా రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. తెలంగాణలో ప్రతిపక్షంగా ఉండి ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు.
తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సెంటిమెంట్ ఉన్నప్పటికీ చాలామంది కార్యకర్తలు, నేతలు కన్నతల్లిలా పార్టీని గౌరవించారన్నారు. వారి స్ఫూర్తిని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నానని చెప్పారు. తెరాస టీడీపీనే టార్గెట్ చేస్తోందన్నారు. మన ఎమ్మెల్యేలను బజారులో పశువుల కంటే హీనంగా కొనుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు.
ఒక్క నాయకుడు వెళ్లిపోతే వందమందిని తయారు చేసుకునే శక్తి టీడీపీకి ఉందన్నారు. ఇప్పటికీ తనది రెండు కళ్ల సిద్ధాంతమే అన్నారు. తాను తెరాసకు విజ్ఞప్తి చేస్తున్నానని, కూర్చొని సమస్యలను పరిష్కరించుకుందామని, పెద్ద మనుషుల ఎదుట పెట్టి విభజన సమస్యలు పరిష్కరించుకుందామన్నారు.
అదీ కుదరకుంటే కేంద్రం ఎదుట పరిష్కరించుకుందామని చెప్పారు. అంతేకానీ, విభేదాలతో వచ్చేదీ ఏమీ ఉండదన్నారు. ఈ విషయాన్ని తెరాస గుర్తించాలన్నారు. తెలంగాణలో ఉన్న సమస్యల పైన తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.
అదే విషయంలో మరో విషయం గుర్తుంచుకోవాలని చంద్రబాబు అన్నారు. అధికారంలో ఉంటే పనులు వెంటనే అవుతాయని, ప్రతిపక్షంలో ఉంటే అలా కుదరదన్నారు. నేను ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా రెండు రాష్ట్రాల కోసం మాట్లాడుతానని చెప్పారు.
అవినీతి డబ్బును వెలికితీస్తానని చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లింగ్తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఏ ఒక్కర్నీ వదలనన్నారు. టీడీపీ పుట్టి ఇన్నేళ్లయినా పేపర్, ఛానల్ పెట్టలేదని, కానీ జగన్ అప్పుటే పేపర్, ఛానల్ పెట్టారన్నారు.