కేఈ నిరాశ: కేంద్రంపై ఘాటుగా..., బాధాకరమని కేవీపీ
హైదరాబాద్: రైల్వే బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులు లేకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గురువారం అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయని, వాటిని పూర్తి చేసేందుకు ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఏవీ లేవన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. ఆర్థిక సంఘం సిఫార్సులు రాష్ట్ర ఆర్థిక అవసరాలను తీర్చేలా లేవన్నారు.
బాధాకరం: కేవీపీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు అన్నారు. పెండింగు ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదన్నారు. పెండిగ్ ప్రాజెక్టులకు నిధుల కోసం త్వరలో కేంద్రమంత్రిని కలుస్తామని కేవీపీ చెప్పారు. పెండింగ్ ప్రాజడెక్టులకు నిధులు ఇచ్చి న్యాయం చేయాలన్నారు.