అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాల్చేయమన్నారు, ఇది నిజం: విభజనపై సుజన
న్యూఢిల్లీ: ఎప్పుడైనా రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయాలు జరిగితే అలాంటి సమయంలో రాజ్యాంగాన్ని కాల్చేయమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చెప్పారని కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి సోమవారం రాజ్యసభలో అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన నాడు సరైన రీతిలో జరగలేదన్నారు. ముమ్మాటికి విభజన అసంబద్ధంగా జరిగిందన్నారు. అప్రజాస్వామికంగా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మరో ఆలోచనే లేదన్నారు. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందిన తీరు ఏపీలోని ప్రతి ఒక్కరినీ కలచివేసిందన్నారు.
రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయాలు జరిగితే దానిని కాల్చేయాలని అంబేడ్కర్ చెప్పారని, దీనిని తాను ఆయనపై గౌరవంతో చెబుతున్నానన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తోందని, ఇప్పటికీ తాము సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నామన్నారు.
చట్ట సభల సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీకి న్యాయం చేయాలన్నారు. కాగా, విభజన అసంబంధంగా జరిగిందని సుజనా చౌదరి చెబుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.