సొంతగా ఎంసెట్, కాకినాడ జేఎన్టీయూకు: హోదాపై..
హైదరాబాద్: ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన ఎంసెట్ పరీక్షను విడిగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సుమారు ఐదున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా ఎంసెట్ వేరుగా నిర్వహించాలని నిర్ణయించింది. ఎంసెట్ తామే నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్రం చెప్పడం, ఉమ్మడిగా నిర్వహిద్దామని ఏపీ ఇటీవలి వరకు చెప్పింది. కొద్ది రోజుల క్రితం ఇరువురు సీఎంలు గవర్నర్తో భేటీ అయ్యారు. ఎంసెట్ విషయమై చర్చించారు. చెరో ఏడాది నిర్వహించాలని గవర్నర్ సూచించారు.
ఈ నేపథ్యంలో ఎంసెట్ సొంతగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాకినాడ జెఏన్టీయూకు ఎంసెట్ నిర్వహణ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. విద్యుత్ ఛార్చీల పెంపు పైన వాడిగా, వేడిగా చర్చ సాగింది. దీనిపై మరోసారి చర్చించాలని నిర్ణయించారు. అలాగే, కొత్త సౌర విద్యుత్ విధానంతో పాటు అక్రమ కట్టడాల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న భూములను స్వాధీనం చేసుకొనే విషయంపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫారసులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే ప్రజల్లోకి వెళ్లడం కష్టమని మంత్రులు, సీఎం చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది. ప్రత్యేక హోదాపై కేంద్రంతో చర్చిస్తానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
సమైక్యవాదులపై కేసుల ఉపసంహరణ: పల్లె
కేబినెట్ భేటీ అంశాలను మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సాయంత్రం తెలిపారు. సమైక్యవాదుల పైన కేసులు ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. మొత్తం 187 కేసుల్లో 181 కేసులు ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. మరో ఆరు కేసులు పరిశీలనలో ఉన్నాయన్నారు.