ఎపి రాజధాని: భూసేకరణపై ఇక కొరడానే..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూసేకరణకు ఇక రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించడానికే సిద్ధపడింది. రైతుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని తీసుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగుతోంది. రాజధాని కోసం ఇప్పటివరకూ రైతులను ఒప్పించి భూ సమీకరణ చేసిన ప్రభుత్వం ఇక తన వద్ద ఉన్న అస్త్రాన్ని ప్రయోగించి భూములను సేకరించాలనే పట్టుదలతో ముందుకు వెళ్తోంది.
భూసేకరణకు ఈనెల 14వ తేదీన డ్రాఫ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సుమారు 1300 ఎకరాల భూమిని భూసేకరణ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో భూసేకరణ ప్రక్రియలో మొదటి భాగమైన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను ఈనెల 14వ తేదీని విడుదల చేయనున్నారు. దీంతో భూసమీకరణ కింద భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతులు ఇక భూసేకరణకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జూన్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయాలని నిర్ణయించడంతో ప్రభుత్వం భూసేకరణపై ఈ నిర్ణయం తీసుకుంది.
కొన్ని ప్రాంతాల్లో రైతులు రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి భూములు సేకరించాలనే ఉద్దేశంతో ఉంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భూసేకరణలో కీలక పాత్ర పోషించారు. రైతులకు నచ్చజెప్పి భూములను సేకరించే పనిని ఆయన నిరంతరం కొనసాగించారు.