రాజధాని రైతులకి కొత్త బట్టలతో సత్కారం: నారాయణ, సింగపూర్ ప్రధాని వస్తారా?
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులను, రైతు కుటుంబాలను శంకుస్థాపన రోజు పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలతో సత్కరిస్తామని ఏపీ మంత్రి నారాయణ గురువారం నాడు వెల్లడించారు. రైతులకు తగిన గౌరవం ఇస్తామన్నారు.
దసరా పర్వదినం నాడు జరిగే రాజధాని శంకుస్థాపన వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు దేశ, విదేశీ ప్రముఖులు హాజరవుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సింగపూర్, జపాన్ ప్రధానమంత్రులు కూడా వచ్చే అవకాశముందని చెప్పారు.
అయితే, వారి రాక ఇంకా పూర్తిగా ఖరారు కాలేదని చెప్పారు. శంకుస్థాపన అంశంపై మినట్ టు మినట్ ప్రోగ్రాం ఖరారయ్యాక ఆ దేశ ప్రధానుల నుంచి పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. రాజధాని శంకుస్థాపన భూ చదును పనులు ఎల్లుండిలోగా పూర్తవుతాయని చెప్పారు.
రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులను ఆహ్వానించే బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించామని మంత్రి నారాయణ తెలిపారు. భూములిచ్చిన రైతులకు ఈ నెల డిసెంబర్ 31వ తేదీలోగా ఇవ్వవలసిన స్థలాలు ఇస్తామని చెప్పారు.
గత ఏడాదిలాగే ఈసారి కూడా నూతన సంవత్సర వేడుకలు తుళ్లూరులోనే ఉంటాయన్నారు. ఇదిలా ఉండగా, రాజధాని అమరావతి నిర్మాణానికి ఆంధ్రా మోటార్స్ మర్చంట్ రూ.5 లక్షల విరాళం ఇచ్చింది. వారు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి విరాళం ఇచ్చారు.
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు రాష్ట్రప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీ, దేశ, విదేశీ ప్రముఖులు రానున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, కేంద్రమంత్రులను ఆహ్వానిస్తున్నారు. ఇంకా చాలామందిని ఈ మెయిల్, ఫోన్ ద్వారా ఆహ్వానించనున్నారు. వేదిక, సీట్ల ఏర్పాటు, బ్యాక్ డ్రాప్, పందిరి, ఎల్ఈడీ స్క్రీన్లు, ఆడియో విజువల్ ఇనస్టలేషన్లు, ఆహారం తదితర అంశాలను వెన్యూ కమిటీ చూడనుంది.