సస్పెన్స్కు తెర : ఏపీ రాజధాని పేరు 'అమరావతి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాజధాని పేరును అమరావతిగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి రాజధాని లేని విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం భూసేకరణ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో కొత్త రాజధాని పేరు పైన చాలా రోజులుగా పలు పేర్లు వినిపిస్తున్నాయి.
అమరావతి, ఎన్టీఆర్, తుళ్లూరు.. తదితర పేర్లు వినిపించాయి. అయితే, ప్రభుత్వం చివరకి అమరావతి పేరు వైపు మొగ్గు చూపింది. కొత్త రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. కొత్త రాజధానిని పర్యాటక, పారిశ్రామిక.. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
చాలా రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పేరును పరిశీలిస్తోంది. రాజధాని అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్న సింగపూర్ ప్రతినిధుల బృందం కొద్ది రోజుల క్రిందట దీని కాన్సెప్ట్ నోట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇచ్చింది.
ఈ సందర్భంగా కొత్త రాజధానికి అమరావతి పేరు ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి ఆ బృందాన్ని ప్రశ్నించినట్లుగా వార్తలు వచ్చాయి. అంతకంటే ముందు సీఎం చంద్రబాబు పాల్గొన్న ఓ సమావశంలో అమరావతి పేరు పైన చర్చ సాగిందని తెలుస్తోంది.