పుష్కర ఘాట్లలో పరిశుభ్రత: వన్కి, టూకి వెళ్తే క్రిమినల్ కేసు
రాజమండ్రి: గోదావరి మహా పుష్కరాలు ఎంతో పవిత్రమైనవని, అందుకే పుష్కర ఘాట్ల సమీపంలో పరిశుభ్రతను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పుష్కర ఘాట్ల వద్ద బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఆ దిశగా కఠిన నియమావళిని ప్రవేశపెట్టారు. పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేకంగా టాయిలెట్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో కాకుండా మరెక్కడైనా బహిరంగంగా ఒకటి, రెండుకు వెళ్తే సహించేది లేదని, కేసులు నమోదు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
గోదావరి పుష్కరాల్లో భక్తులకు 300మంది వాలంటీర్లతో సేవలందించనున్నట్లు రెడ్క్రాస్ సొసైటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ఇలా ఉంటే గోదావరి మహా పుష్కరాల్లో భారీ ఎత్తున సీసీ టీవి కెమెరాలను అమర్చారు. ప్రతి కదలిక రికార్డు కావాలని డీజీపీ రాముడు ఆదేశించిన సంగతి తెలిసిందే.
సోమవారం మధుర కృష్ణమూర్తి, మంగళవారం శ్రీశైల ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ సిద్ధాంతి ముందుగానే పుష్కరాలను ప్రారంభించేశారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాలను బుట్టే వీరభద్ర సిద్ధాంతి.. మంగళవారం ప్రారంభించారు. ఉదయం 7.30 గంటలకు ఆయన పుష్కర స్నానాలు చేశారు.