ఏపీ ఐఏఎస్లలో ముసలం.. రెండుగా చీలిక, టీటీడీ ఈవో పోస్టింగ్ కోసం పోటాపోటీ
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐఏఎస్ కేడర్ అధికారులు రెండు వర్గాలుగా చీలి పోయారు. తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) ఈవో పోస్టింగ్ కోసం ఉత్తరాది, దక్షిణాది అధికారుల మధ్య తీవ్ర పోటి నెలకొన్నట్లు తెలిసింది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐఏఎస్ కేడర్ అధికారులు రెండు వర్గాలుగా చీలి పోయారు. రాష్ట్రంలోని వివిధ కేడర్లకు చెందిన ఐఏఎస్ల బదిలీలు జరగనుండటంతో కొన్ని పోస్టులను తమకు ఇవ్వాలంటే.. తమకే ఇవ్వాలని ఉత్తరాది, దక్షిణాదికి చెందిన అధికారులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) ఈవో పోస్టింగ్ కోసం ఉత్తరాది, దక్షిణాది అధికారుల మధ్య తీవ్ర పోటి నెలకొన్నట్లు తెలిసింది. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ఉన్న ఏకే సింఘల్ టీటీడీ ఈవో పోస్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టడంతో ఈ చిచ్చు రాజుకుంది.
ఉత్తరాది వ్యక్తయిన సింఘల్కు టీటీడీ ఈవో పోస్టు ఇవ్వొద్దని, ఈవో పోస్టుకు తన పేరును పరిశీలించాలని జవహర్రెడ్డి కోరినట్లు తెలిసింది. కొందరు ముఖ్య అధికారులు ఏకే సింఘల్కు మద్దతిస్తున్నారంటూ జవహర్ రెడ్డి అభ్యంతరం కూడా వ్యక్తం చేశారని సమాచారం.
చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కూడా టీటీడీ ఈవో పోస్టు దక్షిణాదికి చెందిన ఐఏఎస్ అధికారికే ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇదిలావుండగా.. ఈవో పోస్టుకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది.