హైదరాబాద్ టు బెజవాడ: ఫస్ట్ దేవినేని శాఖ, ఉద్యోగుల ఆగ్రహం
అమరావతి/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాజధానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుకు చర్యలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ జల భవన్లోని ఏపీ ఉద్యోగులు, ఫైళ్లతో సహా బెజవాడకు తరలి రావాలని ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆదేశాలు జారీ చేశారు.
ఉద్యోగులు, ఫైళ్లను తరలించాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు లేఖ రాశారు. ఏపీ ఇరిగేషన్ శాఖకు చెందిన తొమ్మిది హెచ్ఓడీలను తరలించాలని సూచించారు. కుటుంబాలను, ఉద్యోగులను, ఫైళ్లు ఎలా తరలించాలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
కాగా, ఇప్పటికిప్పుడు తరలింపు అంటే సరికాదని కొందరు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత మంది ఉద్యోగులు, ఫైళ్లు, కుటుంబ సబ్యులు రావాలంటే ఇప్పటికిప్పుడు కష్టసాధ్యమని చెబుతున్నారు. విజయవాడకు వెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే, తమకు అక్కడ అకామిడేషన్ ఎలాగో చెప్పాలంటున్నారు.
కార్యాలయం ఎక్కడో నిర్దిష్టంగా తెలియదని, విభజన సక్రమంగా జరగలేదని, ఇప్పుడు తరలింపు కూడా సక్రమంగా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెజవాడకు వెళ్తే తాము అక్కడ నాన్ లోకల్ అవుతామని, అప్పుడు వారికి ఉద్యోగాలు రావన్నారు.
దాదాపు 700 మంది ఉద్యోగులం ఉన్నామని చెప్పారు. అక్కడ పని చేసే వాతావరణం ఉందని భావించడం లేదంటున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాక తమను తీసుకెళ్లాలని చెబుతున్నారు. తాము హైదరాబాదులో ఉంటామని చెప్పడం లేదని, కానీ మౌలిక సదుపాయాలు ముఖ్యమన్నారు.
సర్దేయండి... రాజధానికి వెళ్దాం
సాగునీటి శాఖలోని 9 హెచ్వోడీ కార్యాలయాలను విజయవాడకు తరలించాలని అధికారులను, మంత్రి ఆదేశించారు. ఇక్కడి కార్యాలయాల్లోని అన్ని ఫైళ్లను అక్కడికి తరలించడానికి అధికారులు కూడా సన్నద్ధమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఆదివారంలోపు తరలింపు ప్రక్రియ పూర్తి కావాలని సంబంధిత హెచ్వోడీలకు ఇంజనీర్ ఇన్ చీఫ్ లేఖలు రాశారు.