అయ్యన్నకు అవమానం!:అసంతృప్తితో వెనుదిరిగి.. గంటా హస్తమేనా?
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి వెళ్లిన అయ్యన్నను అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు.
అమరావతి: ఏపీ ఆర్&బీ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడికి చేదు అనుభవం ఎదురైంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి వెళ్లిన ఆయన్ను అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. ఆయన వాహనానికి అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించేందుకు నిరాకరించారు. దీంతో చేసేదేమి లేక అసంతృప్తితో వెనుదిరిగారు అయ్యన్న.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజకీయ నాయకులకు అవమానాలు, గౌరవాలు చాలా సహజమని పేర్కొన్నారు. అయ్యన్న వెనక్కి వెళ్లిపోయారన్న విషయం తెలియగానే కలెక్టర్ కోన శశిధర్.. ఆయనకు ఫోన్ చేశారు. తిరిగి కార్యక్రమానికి రావాల్సిందిగా అయ్యన్నను కలెక్టర్ కోరినప్పటికీ.. ఆయన మాత్రం అందుకు నిరాకరించారు.
ఇదిలా ఉంటే, అయ్యన్నకు అవమానం వెనుక మరో మంత్రి గంటా హస్తముందన్న ప్రచారం జరుగుతుండటం గమనార్హం. గంటా శ్రీనివాసరావు వల్లే అయ్యన్నకు వర్సిటీలోకి లభించలేదని ఆయన వర్గీయులు వాపోతున్నట్లు తెలుస్తోంది. విశాఖ భూఆక్రమణల వ్యవహారంలో అయ్యన్న వ్యవహరిస్తున్న తీరు రుచించకనే గంటా ఆయన్ను అవమానించే చర్యలకు దిగుతున్నారని చెబుతున్నారు.