తాటతీస్తారు, పులివెందుల రాజకీయాలు మానుకో: జగన్కు దేవినేని సవాల్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అధినేతపై చేస్తున్న విమర్శలకు టీడీపీ నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. తాజాగా, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాలలో అరాచకత్వానికి.. అభివృద్ధికి మధ్య పోటీ జరుగుతోందని ఆయన అన్నారు.
అసమర్థ నాయకుడు
రాష్ట్రానికి అసమర్థ ప్రతిపక్ష నాయకుడు ఉండటం శోచనీయమన్నారు. విజయవాడలో దేవినేని మీడియాతో మాట్లాడారు. జగన్ తండ్రి కాలువల్లో అవినీతి సొమ్ము పారిస్తే.. తాము కాలువల్లో నీరు పారిస్తున్నామని చెప్పారు. నీటిపారుదల అంశాలపై జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. జగన్కు క్యూసెక్కులు, టీఎంసీలకు తేడా తెలియదని విమర్శించారు.
Recommended Video
విష ప్రచారం..
సాక్షి పత్రిక, ఛానల్ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకోవాలని కోరారు. పట్టిసీమతో రైతులు ఆనందంగా పంటలు పండించుకుంటున్నారని.. పట్టిసీమపై ఒక్కసారైనా ప్రతిపక్ష నేత మాట్లాడలేదని అన్నారు.
పులివెందుల రాజకీయాలో మానుకో..
పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చిల్లర, పులివెందుల రాజకీయాలు మానుకుంటే మంచిదని జగన్మోహన్ రెడ్డికి దేవినేని హితవు పలికారు. దమ్ము ధైర్యం ఉంటే ఎదురెదురుగా మాట్లాడుకుందామని సవాల్ విసిరారు. చంద్రబాబు అనుభవమంత లేదు నీ వయస్సు.. ఆయననే విమర్శిస్తావా? అంటూ మండిపడ్డారు.
తాట తీస్తారు..
ప్రత్యేక హోదాను జగన్ ఎక్కడ తాకట్టు పెట్టారని నిలదీశారు. గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేశారో జగన్కు తెలుసా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వారిని ఎందుకు సస్పెండ్ చేసిందో తెలుసుకోవాలని అన్నారు.
గుజరాత్ రాజకీయాల గురించి మాట్లాడితే జగన్ తాటతీస్తారని దేవినేని అన్నారు.