'ఫోన్ ట్యాపింగ్లో తెలంగాణ సర్కార్ కూలడం ఖాయం'
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ రాష్టర సర్కారు కుప్పకూలడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ అన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డికి హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.
అనంతరం ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టింగ్ ఆపరేషన్లు నిలబడవని న్యాయస్థానాలు చెప్పినా పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు చట్టాలు, న్యాయస్ధానాలు, రాజ్యాంగాలకు విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
చంద్రబాబు రాజీనామా చేయాలంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కూడా రావెల మండిపడ్డారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ నేతలపై బూటకపు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
తలసానికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీయేనని, చంద్రబాబు హయాంలో పదవులను అనుభవించి, ఇప్పుడు పార్టీ ఫిరాయించిన తలసానా మాట్లాడేది? అంటూ మండిపడ్డారు. తల్లిపాలు తాగి తల్లి గొంతునే కోసే విధంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతున్నారని అన్నారు.
రాజకీయాల్లోకి రాకముందు తలసాని విలువెంత? సమాజంలో ఆయనకు ఉన్న గౌరవం ఎంత? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్ధ పూరిత రాజకీయాలకు పాల్పడిన తలసానికి చంద్రబాబుపై, విమర్శలు చేసే హక్కు లేదని పేర్కొన్నారు.
తలసాని ఓ రాజకీయ వ్యభిచారి అని మండిపడ్డారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తల్లి మెడకో ఉరేసిన చందంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సెక్షన్ 8ను అమలు చేయకుంటే హైదరాబాదును యూటీ చేయాల్సిందేనని చెప్పారు.
స్టీఫెన్ సన్తో కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన తన అపాయింటుమెంట్లన్నీ రద్దు చేసుకున్నారు. అయితే, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, ఓటుకు నోటు కేసులో కీలకమైన స్టీఫెన్ సన్తో భేటీ కావడం గమనార్హం.
కాగా, ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడు జెరూసలేం మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన పారదర్శక విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకొని, ఆడియో, వీడియోల ద్వారా చిత్రీకరించాలని భావిస్తున్నట్లు న్యాయమూర్తి చెప్పారు.
విచారణ నిష్పక్షపాతంగా జరిగేందుకు ఇరు పక్షాల న్యాయవాదులు సహకరించాలని కోరారు. రికార్డు చేసే విధానం కొత్తేమీకాదని, కేసుకు సంబంధించిన న్యాయవాదులు, తెలంగాణ అడ్వోకేట్ జనరల్, సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్, కేసుకు చెందిన పార్టీలు తప్ప ఎవరు కోర్టు హాలులో లేకుండా విచారణ జరపాలని చెప్పారు.