ధనవంతుడైన మంత్రిగా నారాయణ: 'చంద్రబాబు బినామీ కావడం వల్లే'
హైదరాబాద్: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భూములను కొనేయడం ద్వారా భూ దందాకు తెర తీసి వెల కోట్ల రూపాయలకు మంత్రి నారాయణ పడగలెత్తారని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు.
కుబేర మంత్రులు: ఏపీ నారాయణ ఆస్తి రూ. 496 కోట్లు
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన మంత్రి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నారని ఏడీఆర్ నివేదిక బయటపెట్టిందని ఆయన తెలిపారు. అంతేకాదు మంత్రి నారాయణ... టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి బినామీగా పేర్కొన్నారు.
రాష్ట్రంలో అవినీతి, భూ దందా, మహిళల పట్ల అమానవీయంగా ప్రవర్తించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దూసుకుపోతున్నారని ఆయన మండిపడ్డారు. రాజధాని అమరావతి భూ దందాపై సీబీఐ దర్యాప్తు చేయించాలని తమ పార్టీ అధినేత వైయస్ జగన్ డిమాండ్ చేసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
కృష్ణా పుష్కరాల ఆహ్వానాలపై ఉన్న శ్రద్ధ ఏపీకి ప్రత్యేకహోదా సాధనపై చంద్రబాబుకు లేదని ఆయన ధ్వజమెత్తారు. కృష్ణా పుష్కరాలకు ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించేందుకే తాను ఢిల్లీ వెళ్లానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా భూమన మండిపడ్డారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యనటలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధిలో తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఇక, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ బిల్లు చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యవహరించి తీరు అభ్యంతకరమన్నారు.
డిప్యూటీ స్పీకర్ కురియన్ కేవీపీ బిల్లును లోక్సభకు నివేదించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి సుజనా బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇక, బెజవాడలో మహాత్మ గాంధీ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. గాడ్సే కంటే తన అల్లుడు హీనుడని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు.
జాతిపితకు ఇంత అవమానం జరిగినా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదన్నారు. గాడ్సే బాబు అని పిలవాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన నిరంకుశంగా, అప్రజాస్వామికంగా ఉందని మండిపడ్డారు.