జగన్ను రాక్షసులతో పోల్చిన మంత్రి, తిరుమలలో హెరిటేజ్పై చెవిరెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో ఆయన మాట్లాడారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష నేతగా వ్యవహరించాల్సిన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
సమాజహితం కోసం పూజలు చేసే దేవతలను రాక్షసులు అడ్డుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, ఆయన అభివృద్ధి కార్యక్రమాలను జగన్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జగన్కు ఏమాత్రం రాజకీయ పరిణతి లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తామన్నారు.
ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పొద్దు: రాఘవులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అది సాధ్యమని చెప్పడం సరికాదని సీపీఎం నేత రాఘవులు అన్నారు. బుధవారం హైదరాబాదులో పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కేంద్రం రాజధాని నిర్మాణానికి ప్రకటించిన ఆర్ధికసాయం ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు.
రాజధాని కోసం ముప్పై వేల ఎకరాలు ఎందుకని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. రైతుల భూములు కాకుండా కృష్ణా నదీతీరంలో ఉన్న పెట్టుబడిదారి పారిశ్రామిక వేత్తల భూములను స్వాధీనం చేసుకుని రాజధాని నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
తిరుమలను హెరిటేజ్ తిరుమలగా మార్చుతారేమో?: చెవిరెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు తన వ్యాపారాలకు తిరుమలను వాడుకోవడం సరికాదని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. తిరుమల కొండపై హెరిటేజ్ పార్లర్కు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు తిరుమలను తన జేబు సంస్థగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో తిరుమల పేరును కూడా హెరిటేజ్ తిరుమలగా మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.