కెసిఆర్ రెచ్చగొడ్తున్నారు, 150ఫోన్లు ట్యాప్: రాష్ట్రపతికి ఏపీ మంత్రులు, సెక్షన్8 వద్దయితే పార్లమెంట్కెళ్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెచ్చగొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రులు కెఈ కృష్ణమూర్తి, పత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు మంగళవారం అన్నారు. సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాల పైన వారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు.
అనంతరం కెఈ విలేకరులతో మాట్లాడారు. సెక్షన్ 8 పైన రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కెసిఆర్ ఉద్యోగ సంఘాలను రెచ్చగొడుతున్నారన్నారు. విభజన చట్టాన్ని కెసిఆర్ మరోసారి చదవాలని హితబోధ చేశారు. సెటిలర్స్ అనడం బాధిస్తోందన్నారు.
ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రభుత్వం అజమాయీషీ ఏమిటని ఆయన ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల వివాదాల పరిష్కారానికి గవర్నర్ కృషి చేయాలన్నారు. హైదరాబాదులో ఏపీ కార్మిక శాఖను ఏర్పాటు చేస్తామన్నారు.
సెక్షన్ 5 పైన తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్తోందని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఉద్యోగులు, భవనాల పంపకంలో ఏకపక్షంగా వెళ్తోందని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడికే రక్షణ లేనప్పుడు సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 150 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆయన బాంబు పేల్చారు.
రాష్ట్రపతికి తాజా పరిస్థితులను వివరించామని చెప్పారు. సెక్షన్ 8 రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగమే అన్నారు. విభజన సమయంలో సెక్షన్ 8కు అంగీకరించి ఇప్పుడు వ్యతిరేకించడమేమిటని ప్రశ్నించారు. అభ్యంతరం అనుకుంటే కెసిఆర్ పార్లమెంటు నుండి సవరణ తెచ్చుకోవాలన్నారు. సెక్షన్ 8 అమలు చేయాలన్నారు.