వివాహితను తన కోర్కె తీర్చమన్న ఎస్సై, ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 'షీ టీమ్స్' ఆకతాయిల పని పడుతుంటే, ఏపీలో మాత్రం పోలీసులే ఆకతాయిల్లాగా మారి అమ్మాయిల వెంట పడి కోర్కెలు తీర్చమంటున్నారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా మక్కువ మండలంలో చోటు చేసుకుంది.
మండలంలోని ఎస్సైపై ఇద్దరు మహిళలు ఏఎస్పీకి ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, మక్కువ మండలంలోని చెముడు గ్రామానికి చెందిన బొంగు సింహాచలం అనే వ్యక్తిని అతని కుమారుడు పట్టించుకోకపోవడంతో అతను, ఎస్సై రవీంద్ర రాజును ఆశ్రయించాడు.
దీంతో సింహాచలం వద్ద ఉన్న పొలాన్ని అతని కుమార్తె, కుమారుడికి పంచేయాలని ఎస్సై రవీంద్ర రాజు సూచించారు. దీనికి అంగీకరించిన సింహాచలం, ఎస్సై సూచన మేరకు కుమార్తెతో కలిసి మే 16వ తేదీన పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
ముందుగా సింహాచలాన్ని రూం లోపలికి పిలిపించిన ఎస్సై రవీంద్ర రాజు, 20000 ఇస్తే సమస్యను పరిష్కరిస్తానని సలహా ఇచ్చాడు. దీంతో తాను ఓ వెయ్యి రూపాయలు ఇవ్వగలనని, అంతకంటే ఎక్కువ ఇవ్వలేనని సింహాచలం స్పష్టం చేశాడు.
ఆ తర్వాత అతని కుమార్తెను లోపలికి పిలిపించిన రవీంద్రరాజు రెండో రోజులు తనతో గడిపితే సమస్య పరిష్కారమవుతుందని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఏడుస్తూ బయటకి వచ్చేందుకు ప్రయత్నించగా, తుపాకీ చూపించి విషయం ఎవరికైనా చెబితే కాల్చేస్తానంటూ బెదిరించాడు.
దీంతో, వైజాగ్లో ఓ లాయర్ సలహా మేరకు ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, విశాఖలో ఉన్న ఎస్సై సంబంధీకులతో ఆమెను కేసు వాపస్ తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె చెప్పింది.
ఇది ఇలా ఉంటే మరో మహిళ, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద నుంచి ఎస్సై రవీంద్ర రాజు తల్లి 3 లక్షల రూపాయలు తీసుకుని ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందని, తనకు న్యాయం చేయాలని కోరింది.