60వేలకు చేరిన ఏపీ రైతు రుణమాఫీ ఫిర్యాదులు
అమరావతి: రైతు రుణమాఫీపై ఇప్పటివరకు 60వేల ఫిర్యాదులు అందినట్లు ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి. కుటుంబరావు చెప్పారు. ఈ నెలాఖరు నుంచి వీటి నమోదు ప్రక్రియ మొదలుపెట్టి, మేలోగా పూర్తి చేస్తామని చెప్పారు. సోమవారం ఏపీ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో రైతుల రుణమాఫీ ప్రక్రియ వేగంగా జరుగుతోందని చెప్పారు. ఆ ప్రాంత పరిధిలో మొత్తం 22 వేల ఖాతాల నమోదు ప్రక్రియను బ్యాంకులు పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. ఒక్కో ఖాతా నమోదుకు పది నిమిషాల పడుతుందని అన్నారు.
బుధవారం సాయంత్రానికి అన్ని అయిపోతాయని, ఆ తర్వాత వాటిని పరిశీలించేందుకు ఒక రోజు పడుతుందని చెప్పారు. గతంలో చెప్పినట్లు రాజధాని ప్రాంత రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈనెల 25లోగా ఒక్కొక్కరికి గరిష్టంగా రూ. లక్షన్నర వరకు నగదు జమ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
ఇక జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీ ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేసే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఫిర్యాదుల సంఖ్యను బట్టి నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికి రాష్ట్రస్ధాయి కేంద్రంలోనే వాటిని స్వీకరించనున్నట్లు తెలిపారు.