కోడెల కూతురుపై భూ కబ్జా కేసు నమోదు: కోర్టు అదేశాలతో విచారణ ప్రారంభించిన పోలీసులు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె పి.విజయలక్ష్మీపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మొబైల్ కోర్టు ఆదేశాల మేరకు విజయలక్ష్మి, మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాల రోడ్డులోని తన భూమిని విజయలక్ష్మి మరో ఆరుగురితో కలిసి తన స్థలాన్ని కబ్జా చేశారని గత నెల 17న నల్లపాడు గ్రామానికి చెందిన కుందూరు శివలక్ష్మి స్పెషల్ మొబైల్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
దీనిని విచారించిన మొబైల్ కోర్టు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. స్పెషల్ మొబైల్ కోర్టు ఆదేశం వచ్చిన వెంటనే విచారణ ప్రారంభించామని, విచారణ ప్రాథమిక దశలో ఉందని గుంటూరు సౌత్ డీఎస్పీ బి.శ్రీనివాస్ గురువారం రాత్రి చెప్పారు.
గత నెలలోనే కోడెల కూతురు విజయలక్ష్మి, ఆమె సహాయకులపై గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది జి శాంత కుమార్.. పేరేచర్లకు చెందిన కుందూరి శివలక్ష్మి తరపున పిటిషన్ దాఖలు చేశారు. అక్రమంగా తమకు చెందిన 2.68 ఎకరాల భూమిని విజయలక్ష్మి కబ్జా చేశారని పిటిషన్లో శివలక్ష్మి పిటిషన్లో పేర్కొన్నారు.
14ఏళ్లుగా ఆ భూమి తమ కుటుంబానికి చెందినదేనని వివరించారు. 2001లో ఆ భూమిని తాము కొనుగోలు చేశామని, అయితే గత జులై 22న 150 మందితో వచ్చిన నిందితులు తమపై దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారని ఆరోపించారు. కాగా, విజయలక్ష్మి గుంటూరులో గైనకాలజిస్టుగా పని చేస్తున్నారు.