దిద్దుబాటు: ఎపికి అదనపు విద్యుత్తు, కెసిఆర్ రివ్యూ
న్యూఢిల్లీ: ఐదేళ్ల విద్యుత్తు వినియోగం ఆధారంగా విద్యుత్తును కేటాయిస్తూ విభజన బిల్లులో జరిగిన పొరపాటును కేంద్ర ప్రభుత్వం సరిదిద్దింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంధన శాఖ కార్యదర్సులు సోమవారం ఢిల్లీలో నీరజ్ మాథుర్ కమిటీ వద్ద వాదనలు వినిపించారు.
ఎపికి అదనంగా 1.77 శాతం విద్యుత్తు ఇవ్వాలని నీరజ్ మాథుర్ కమిటీ ఆదేశించింది. అదనపు విద్యుత్తు కేటాయింపునకు తెలంగాణ అంగీకరించింది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ 47.88 శాతం విద్యుత్తును పొందుతుంది. పిపిఎలపై రెండు రాష్ట్రాల వాదనలను కమిటీ విన్నది. ఈ నెల 24వ తేదీన రాష్ట్రాల ప్రతినిధులతో నీరజ్ మాథుర్ కమిటీ మరోసారి సమావేశం అవుతుంది.
ఇదిలావుంటే, విద్యుత్ శాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం హైదరాబాదులో సమీక్ష సమావేశం నిర్వహించారు. జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ జెన్కోలో 6 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
చత్తీస్గఢ్ నుంచి 2వేల మెగావాట్లు కొనుగోలు చేస్తే సరఫరాకు అనుకూలమైన లైన్లు ఏర్పాటుచేయాలని సూచించారు. రామగుండంలో 4వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలోని నదులపై సర్వే చేసి ఎక్కడ జల విద్యుత్ ఏర్పాటు చేయాలో నిర్ధారించాలని తెలంగాణ జెన్కో అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.
ఉమాభారతితో హరీష్ రావు భేటీ
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఇచ్చి న్యాయం చేయాలని ఉమాభారతికి మంత్రి హరీష్రావు విజ్ఞప్తి చేశారు.