టెక్కీ, కొడుకు హత్య: కేరళ యువతి వల్లే చిచ్చు?, హత్యపై అనుమానాలు
రెండేళ్ల నుంచి హనుమంత రావు ప్రవర్తన సరిగా లేదని, శశికళను సరిగా చూడటం లేదని, ఈ విషయం అతని కుటుంబ సభ్యులకు తెలిసినా చక్కదిద్దేందుకు ప్రయత్నించలేదని శశికళ ఫ్యామిలీ ఆరోపిస్తోంది.
అమరావతి: రెండేళ్ల నుంచి హనుమంత రావు ప్రవర్తన సరిగా లేదని, శశికళను సరిగా చూడటం లేదని, ఈ విషయం అతని కుటుంబ సభ్యులకు తెలిసినా చక్కదిద్దేందుకు ప్రయత్నించలేదని శశికళ ఫ్యామిలీ ఆరోపిస్తోంది.
అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న శశికళ, ఆమె కొడుకు హనీష్ సాయి మృతి చెందిన విషయం తెలిసిందే. వీరి మృతికి శశికళ భర్త హనుమంత రావు కారణమని మృతురాలి ఫ్యామిలీ ఆరోపిస్తోంది.
ఇదీ శశికళ ఫ్యామిలీ
సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్న శశికళ, ఆమె కుమారుడు హనీష్ ఇంట్లోనే హత్యకు గురైన విషయం తెలిసిందే. మృతురాలి తల్లిదండ్రుల సుంకర వెంకటేశ్వర రావు, కృష్ణకుమారి ఉపాధ్యాయులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. పోరంకిలోని లక్ష్మీపురంలో నివాసముంటున్నారు. వీళ్ల కుమారుడు భాస్కర్ హైదరాబాద్లో ఐసీఐసీఐ బ్యాంక్లో పని చేస్తున్నాడు.
శశికళను ప్రకాశం జిల్లా పరుచూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన నర్రా హనుమంతరావుకు ఇచ్చి 2004వ సంవత్సరంలో పెళ్లి చేశారు. హనుమంత రావు న్యూజెర్సీలోని కాంప్లాస్ట్ అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. వివాహం తర్వాత శశికళనూ అక్కడికి తీసుకు వెళ్లాడు. వీరిద్దరు మేపూర్ సిటీలో నివసిస్తున్నారు. వీరికి ఏడేళ్ల కుమారుడు హనీష్ సాయి ఉన్నాడు.
కొంతకాలం సజావుగానే
వివాహమైన తర్వాత హనుమంత రావు, శశికళ సంసారం సజావుగానే సాగింది. తర్వాత తర్వాత వివాదాలు మొదలయ్యాయి. గడచిన అయిదేళ్లుగా భర్త వేధిస్తున్నాడని శశికళ ఫ్యామిలీ ఆరోపిస్తోంది. భర్త వేధింపులను భరించలేక శశికళ ఆ విషయాన్ని అత్తమామలకు చెప్పింది. అత్త మూడు నెలల క్రితం న్యూజెర్సీ వెళ్లారు. అయినా హనుమంత రావు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని, చాలా సందర్భాల్లో చేయి చేసుకున్నాడని శశికళ బాధపడిందని ఆమె మేనమామ చెప్పారు.
కేరళ యువతి వల్లే చిచ్చు!
శశికళను హనుమంత రావు తరచుగా వేధించడం వెనుక వివాహేతర బంధమే కారణమని ఆమె మేనమామ ప్రభాకర్ ఆరోపించినట్లుగా తెలుస్తోంది. హనుమంతరావు తాను పనిచేసే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కేరళకు చెందిన వివాహితతో సంబంధం పెట్టుకున్నాడని చెబుతున్నారు. తనకు విడాకులు ఇచ్చేసి మరో వివాహం చేసుకుంటానని హనుమంతరావు పలుమార్లు వేధించేవాడంటున్నారు.
కిరాయి హంతకులతో చేయించాడా? మరో కారణమూ...
కేరళకు చెందిన వివాహితను పెళ్లి చేసుకోవడానికి కిరాయి హంతకులతో హనుమంత రావు ఈ పని చేయించాడని, లేకపోతే అతడు, ఆమె కలిసి చంపేసి ఉంటారని శశికళ మేనమామ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల తన అకౌంట్, శశికళ అకౌంట్ నుంచి రూ.80లక్షలను డ్రా చేసి హనుమంతరావు తల్లిదండ్రులకు ఇచ్చాడని చెబుతున్నారు. దీనిపైనా భార్యాభర్తలిద్దరి మధ్య వివాదాలు నడుస్తున్నట్టు బంధువులు పేర్కొంటున్నారు.
చంద్రబాబు, లోకేష్ సంతాపం
శశికళ, హనీష్ సాయి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. శశికళ, ఆమె కుమారుడు హనీష్సాయి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.