అడ్డగోలుగా అంటే: చిచ్చుపెట్టేందుకే ఆందోళనలా?
జల్లికట్టు ఆందోళన స్ఫూర్తితో యువత ఎపికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఉద్యమానికి పూనుకుంది. ఈ స్థితిలో చంద్రబాబు అనుసరిస్తన్న వైఖరి ఎలా ఉంది...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తూ గత యుపిఎ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పదేపదే విరుచుకుపడతారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని చెప్తుంటారు. రెండో రోజుల క్రితం దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొని వచ్చీరాగానే ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి.
తమిళనాడులో జల్లికట్టు పునరుద్ధరణ కోసం యువత జరిపిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ యువత ఈ నెల 26న విశాఖపట్నం నగరంలో బంగాళాఖాతం తీరాన ప్రత్యేక హోదా కోసం శాంతియుత ఉద్యమానికి సిద్ధమవుతుంటే ఏపీ సీఎం చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. దీనికి తోడు జనసేన వ్యవస్థాపకుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఆందోళనకు మద్దతు పలకడం ఆయన ఆగ్రహం మరింత పెరగడానికి కారణమైంది.
సోషల్ మీడియా వేదికగా సాగిన ప్రచారోద్యమానికి పవన్ కల్యాణ్ తోపాటు టాలీవుడ్ నట నటీమణులంతా బాసటగా ఉంటామని మద్దతు పలికారు. కానీ ఏపీ డీజీపీ సాంబశివరావు మాత్రం ఎవరు అనుమతి కోరకుండా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారానికి అనుగుణంగా నిరసన ప్రదర్శనకు అనుమతించలేమని సెలవిచ్చారు. చెన్నై నగరంలో జల్లికట్టు ఉద్యమంలో మాదిరిగా హింసాత్మక ఘటనలకు పాల్పడితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆర్టీసీ ఎండీగా తిరస్కార భావన ప్రదర్శించిన ఘనత ప్రస్తుత ఏపీడీజీపి సాంబశివరావుది.
రెండు కళ్ల సిద్ధాంతం...
చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తారని గిట్టని వారంటారు. 2008లో నాటి ప్రణబ్ కమిటీకి, 2009 డిసెంబర్ ఏడో తేదీన నాటి సిఎం కొణిజేటి రోశయ్య నిర్వహించిన అఖిలపక్ష కమిటీకి తెలంగాణకు అనుకూలమని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన సంగతి మరిచిపోయారా? అంటే కాదు. ఆ సంగతి తెలియక కాదు. తాను సరిగ్గానే వ్యవహరించానని పేర్కొంటూ రెండు కళ్ల సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చారు. తాను సచ్ఛీలుడ్ని, మిగతా వారిలోనే కుఠిల నీతి ఉంటుందని చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తారు.
పదేళ్లు కావాలని వెంకయ్య పట్టు
2013లో నాటి యుపిఎ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విభజనకు శ్రీకారం చుట్టినప్పుడు కాలికి బలపం కట్టినట్లు నిలువరించేందుకు తిరిగిన చంద్రబాబు సంగతి తెలియని వారెవ్వరూ లేరు. దీనికి తోడు నాడు విపక్షంలో ఉన్న బిజెపి నాయకుడు - ప్రస్తుత పట్టణాభివ్రుద్ధిశాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఈ సంగతి గ్రహించే నాటి యుపిఎ ప్రభుత్వం ఏపికి ఐదేళ్ల ప్రత్యేక హోదా హామీని రాజ్యసభ సాక్షిగా ఇచ్చింది. దానికి ఐదేళ్లు చాలదని, పదేళ్లు కావాలని వెంకయ్యనాయుడు పట్టుబట్టిన సంగతి వారు మరిచిపోయి ఉండవచ్చు గానీ రెండు తెలుగు రాష్ట్రాల పౌరులు, ప్రత్యేకించి యువత మరిచిపోలేదు.
అమరావతి కోసం పచ్చని పంట పొలాలు...
ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో బిజెపి, ఏపీలో తెలుగుదేశం, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాయి. రాష్ట్ర విభజన సమయంలోనే కేంద్రం ముందుచూపుతో ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటు కోసం నిపుణులతో ఏర్పాటుచేసిన కమిటీ సూచనలు తోసిరాజని పచ్చని పంట పొలాలు ధ్వంసం చేసీ మరి రాజధాని నిర్మించుకున్న గొప్ప మనస్సు చంద్రబాబుది.
తెలుగు రాష్ట్రాల్లోని నేతల్లో మార్పు రావాలి...
తమిళనాడు రాష్ట్ర రాజకీయాలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు నేర్చుకోవాల్సిన గుణపాఠం చాలానే ఉన్నదని తెలుస్తోంది. ఏ అంశంలోనైనా తమిళనాడులో అధికార, విపక్షాలదీ ఒకటే బాణి. అయితే జల్లికట్టు ఉద్యమానికి తెర వెనుక నుంచి అధికార అన్నాడీఎంకే మద్దతు లభించిందని వినికిడి. అయినా అధికార, విపక్షాలు మొదలు సినీ, వాణిజ్య, వ్యాపార వర్గాలు బాసటగా నిలిచాయి. అనధికారికంగానే బిజెపికి అన్నాడీఎంకే అధికార పక్షంగా వ్యవహరిస్తోంది. అందుకే లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అన్నా డీఎంకే నేతే కావడం గమనార్హం.
జల్లికట్టుకు అనుమతి కోసం...
జల్లికట్టు ఉద్యమం పతాకస్థాయికి చేరుకోవడంతో తమిళనాడు సిఎం పన్నీర్ సెల్వం ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. కేంద్ర స్థాయిలో సాధ్యం కాకపోతే రాష్ట్ర స్థాయిలో ఆర్డినెన్స్ జారీకి గల న్యాయపరమైన, చట్టపరమైన అనుకూలాంశాలను పరిశీలించారు. వెంటనే రాష్ట్ర స్థాయిలో జల్లికట్టుపై ఆర్డినెన్స్ జారీ అయింది. జల్లికట్టు ఆందోళన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రత్యేక హోదాతోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రాచీన క్రీడల పునరుద్ధరణకు ఆందోళనలు మొదలయ్యాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం యువకులు ఉద్యమించడం అధికార తెలుగుదేశం పార్టీకి, ప్రత్యేకించి సిఎం చంద్రబాబు నాయుడుకు మాత్రం కంటగింపుగా మారింది.
కెవిపి లేఖ, పవన్ కల్యాణ్ మద్దతుతో...
అందుకే తమిళనాడు యువతకు గల ఐక్యతా స్ఫూర్తి.. ప్రత్యేక హోదా కోసం ఏపీలో కరువైందా. అంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల్లో మద్దతు పలికిన పవన్ కల్యాణ్.. యువత ఆందోళనకు మద్దతునివ్వడం చంద్రబాబుకు సుతారామూ ఇష్టం లేదు. ఎక్కడ ఆందోళన జరిగినా మద్దతుగా నిలుస్తామని వైఎస్ జగన్ ప్రకటించడం ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు కేంద్రంతో తగువు పెట్టుకోవాలా? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
విశాఖలో ఉద్విగ్న పరిస్థితి...
తమిళనాడు వారైనా, మహారాష్ట్ర వారైనా, ఇక కర్ణాటక రాజకీయ నాయకులైనా ఒకే మాటపై నిలబడతారు. కేంద్రంతో తలపడేందుకు వెనుకాడబోరు. కానీ చంద్రబాబు కేంద్రంతో ఘర్షణకు దిగబోనని బీకర ప్రతిజ్నలు చేస్తున్నారు. ఆందోళనలకు అనుమతి నిరాకరించడంతో విశాఖతీరంలో యువకుల శాంతియుత నిరసనకు అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నాహాలు చేసుకుంటున్నది. ఏపీకి ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, తద్వారా తమకు ఉపాధి లభిస్తుందని ఆశలు పెట్టుకున్న యువతను రెచ్చగొడతారా? శాంతియుత ఆందోళనకు మద్దతుగా నిలిచి కేంద్రంపై ఒత్తిడి తెస్తారా? అన్నది తేలాల్సి ఉన్నది. ఒకవేళ ఒత్తిడి తేవాలంటే తెలంగాణలో ‘ఓటుకు నోటు కేసు' వెంటాడుతున్నందునే చంద్రబాబు ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్తున్నందున ఘర్షణ పడి విభేదాలు పెంచుకోలేనని చెప్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శిస్తోంది.