అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావడంలో చంద్రబాబు పాత్ర కీలకం!
హైదరాబాద్: దివంగత అబ్దుల్ కలాంను రాష్ట్రపతి పీఠం పైన కూర్చుండబెట్టడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతో ఉంది. ఆయనే కీలక భూమిక పోషించారు. 2002లో కలాం రాష్ట్రపతి అయ్యారు.
అప్పుడు కేంద్రంలో అటల్ బిహారీ వాజపేయి సారథ్యంలోని ఎన్డీయే అధికారంలో ఉంది. అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్గా ఉన్నారు. భారత రాష్ట్రపతిగా మైనార్టీ వర్గానికి చెందిన ప్రముఖుడిని నియమించాలని వాజపేయి తీర్మానించారు.
ముగ్గురు మైనార్టీ నేతల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసి, ఎన్డీయే కన్వీనర్ హోదాలో ఉన్న చంద్రబాబుకు ఫోన్ చేశారు. జాబితాలో మూడు పేర్లలో అబ్దుల్ కలాం పేరును చంద్రబాబు ఆమోదం తెలిపారని చెబుతున్నారు.
శాస్త్రవేత్తగా ఉన్న కలాం రాష్ట్రపతిగా అంగీకరిస్తారా అని వాజపేయీ అడగ్గా.. తాను ఒప్పిస్తానని చంద్రబాబు సమాధానం ఇచ్చారని, వెంటనే ఆయన కలాంను సంప్రదించి విషయం చెప్పారని, తనకు ఇవన్నీ ఇప్పుడెందుకు అని కలాం.. చంద్రబాబుతో అనగా.. నో చెప్పవద్దని బాబు ఒప్పించారు.
మీకు ఇప్పుడు ఓ ఫోన్ కాల్ వస్తుందని, దానికి మీరు నో చెప్పవద్దని చంద్రబాబు... కలాంకు చెప్పారు. అప్పుడు ప్రధాని వాజపేయి నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత ప్రధాని ఫోన్ రావడం.. విషయం చెప్పడం.. జరిగింది.