జనానికి బాహుబలి ఫీవర్.. జగన్కు బెయిల్ ఫీవర్, ఏప్రిల్ 28న ఆ రెండు ఉత్కంఠలకు తెర!
జగన్ రాజకీయ భవితవ్యాన్ని ప్రభావితం చేసే ఈ తీర్పుపై ప్రస్తుతం ఆ పార్టీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అమరావతి: ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనాన్ని బాహుబలి ఫీవర్ ఆవహించింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ఉత్కంఠను రెండేళ్లుగా ఉగ్గపట్టుకున్న అభిమానులు.. ఇక తెర మీద ఆ దృశ్యాన్ని చూసేందుకు తహతహలాడుతున్నారు. మరో 48గం. గడిస్తే.. థియేటర్కు వెళ్లి ఆ రహస్యమేంటో తేల్చుకోవాలనుకుంటున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే!.. ఏపీ జనాన్ని బాహుబలి ఫీవర్ ఆవహిస్తే.. అదే సమయంలో వైసీపీని బెయిల్ ఫీవర్ వెంటాడుతోంది. జగన్ బెయిల్ కు సంబంధించి అదే రోజు, అనగా ఏప్రిల్ 28న తీర్పు వెలువడనుండటంతో.. ఆ పార్టీలో కలవరం మొదలైంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో.. తీర్పు తమకు ప్రతికూలంగా వస్తుందా? సానుకూలంగా వస్తుందా? అని అంతే స్థాయిలో వైసీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.
జగన్ రాజకీయ భవితవ్యాన్ని ప్రభావితం చేసే ఈ తీర్పుపై ప్రస్తుతం ఆ పార్టీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, సాక్ష్యులను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారన్న కారణంగా.. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా కేసులో సాక్షిగా ఉన్న మాజీ సీఎస్ రమాకాంత్రెడ్డి ఇంటర్యూ వల్లే జగన్ కు ఈ పరిస్థితి వచ్చింది. కేఎస్ఆర్ ఇంటర్వ్యూలో భాగంగా.. జగన్ పై ఉన్న కేసుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ తర్వాతనే ఈ కేసును తిరగదోడే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా ఏప్రిల్ 28న రెండు ఉత్కంఠలకు ఒకేసారి తెరపడనుండటం విశేషం.