తాత్కాలిక డ్రైవర్లతో తిరుగుతున్న బస్సులు: ఆర్టీసీ సమ్మె పాక్షికమేనా..?
హైదరాబాద్: 42 శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు ప్రారంభించిన సమ్మె మొదటి రోజునే తేలిపోయింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభం కాగా, రెండు రాష్ట్రాల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు జోరుగా సాగుతుండటంతో చాలా ప్రాంతాల్లో బస్సులు తిరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీ లోని గుంటూరు జిల్లాలోనే పలు బస్ డిపోల నుంచి సుమారు రెండు వేలకు పైగా బస్సులు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గుంటూరు - విజయవాడ మధ్య సుమారు 62 బస్సులు తిరుగుతున్నాయి.
అదే విధంగా విజయవాడ, గుంటూరుల నుంచి రాజమండ్రి, ఒంగోలు, మాచర్ల, నెల్లూరు తదతర ప్రాంతాలకు తాత్కాలిక డ్రైవర్లు, కండెక్టర్లతో బస్సులను బయలుదేరి వెళుతున్నాయి. దూరప్రాంతాలకు వెళుతున్న బస్సుల్లో పోలీసులను సెక్యూరిటీగా పెట్టి మరీ నడుపుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇక ఒంగోలు జిల్లాలో సైతం సుమారు వెయ్యికి పైగా బస్సులు తిరుగుతున్నాయని డిపో అధికారులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్ధానానికి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మరిన్ని బస్సులను తిరుమలకు నడుపుతున్నారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అన్ని డిపోల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండెక్టర్ల నియామకాలు జోరుగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హెవీ లైసెన్స్ కలిగి ఉండి, పదవ తరగతి పాసైన నిరుద్యోగ డ్రైవర్లూ క్యూ కట్టారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.