మిత్రులు విమర్శిస్తున్నారు: పవన్ కళ్యాణ్, జగన్లకు వెంకయ్య చురకలు
అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం నాడు అమరావతి పరిపాలనా నగరానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు జైట్లీ, మరో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గుంటూరుకు చెందిన భూగర్భ మురుగు నీటి వ్యవస్థకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబును వెంకయ్య సోదరుడిగా పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఆదర్శవంతంగా ఇక్కడి రైతులు నిలిచారన్నారు. రాజధానికి భూమిని ఇచ్చి ఈ రైతులు చరిత్రలో నిలిచారన్నారు.
మా భవిష్యత్తుకు, మా బిడ్డల భవిష్యత్తుకు మంచి రాజధాని కావాలని కోరుకుంటూ ఈ గ్రామాల ప్రజలు రాజధానికి భూమి ఇచ్చారని, తాను మనసారా అభినందిస్తున్నానని చెప్పారు.
దేశం మారుతోందన్నారు. సంస్కరించి, పని చేయు, మార్పు చేసి చూపించాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారన్నారు. వీటిలో మనం భాగస్వాములం కావాలన్నారు. ఈ దేశాన్ని శక్తిమంతంగా తయారు చేయాలన్నారు. భారతదేశాన్ని రామరాజ్యంగా చేసేందుకు ప్రధాని మోడ నిత్యం కృషి చేస్తున్నారన్నారు.
పవన్, జగన్కు వెంకయ్య చురకలు
ఏపీని అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ కేంద్రం ఏపీకి ఇచ్చినన్ని నిధులు మరే ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పారు.
అయినా కొంతమంది మిత్రులు విమర్శలు చేస్తున్నారని అన్నారు. కొంతమంది ఎప్పుడు బాధను వెళ్లగక్కుతున్నారని, వారు ఎప్పుడు వెళ్లగక్కుతూనే ఉంటారన్నారు. కొంతమంది కోపంతో ఉన్నారని, వారు ఎప్పుడు కోపంతో ఉంటారన్నారు. కాగా, ప్యాకేజీ పైన కొంతమంది మిత్రులు విమర్శలు చేస్తున్నారని వెంకయ్య చెప్పడం గమనార్హం. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లుగా భావిస్తున్నారు.
అలాగే, కొంతమంది కోపం, బాధను వెళ్లగక్కుతున్నారని, అలాంటి వారు మన రాష్ట్రంలో ఉన్నారని, వారి గురించి పట్టించుకోవద్దని వెంకయ్య అన్నారు. ఈ వ్యాఖ్యలు వైసిపి అధినేత జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారని చెప్పవచ్చు.
చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దూసుకెళ్తోందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్లా ముందు ముందు గ్రేటర్ అమరావతి కార్పోరేషన్ అవుతుందన్నారు. ఏపీకి కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు. చట్టంలో చెప్పిన వాటిని నూటికి నూరుపాళ్లు అమలు చేస్తామన్నారు.
ఏపీకి నిధులు రావడానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా అన్నారు. మన రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేలా అందరూ సహకరించాలని వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. మనకు ఓపిక ఉంటే ఏపీకి మంచి భవిష్యత్తు ఉందన్నారు. మన పిల్లలకు మంచి భవిష్యత్తు అన్నారు. ఎవరో రెచ్చగొడితే మనం వారి వలలో పడవద్దన్నారు.