అశోక్ గజపతి వారసురాలి రాజకీయ అరంగ్రేటం?.. అనుచరుల ఆగడాలు పట్టని కేంద్ర మంత్రి
1983లో తొలిసారి శాసనసభకు ఎన్నికైన పూసపాటి అశోక్ గజపతి రాజు ప్రస్తుతం విజయనగరం లోక్ సభ స్థానం నుంచి తొలిసారి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రధాని నరేంద్రమోదీ క్యాబినెట్లో పౌర విమానయాన శాఖ మంత్రి
హైదరాబాద్/అమరావతి: 1983లో తొలిసారి శాసనసభకు ఎన్నికైన పూసపాటి అశోక్ గజపతి రాజు ప్రస్తుతం విజయనగరం లోక్ సభ స్థానం నుంచి తొలిసారి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రధాని నరేంద్రమోదీ క్యాబినెట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక రాజకీయాలకు పెట్టింది పేరుగా గజపతి రాజు కుటుంబం నిలిచింది. కానీ 66 ఏళ్ల వయస్సులో ఉన్న అశోక్ గజపతి రాజు భవిష్యత్లో తన కూతురుకు తన రాజకీయ రంగ ప్రవేశం కల్పించాలని సంకల్పించారు.
అందుకే తెలుగుదేశం పార్టీ నాయకత్వం తనను కాదని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మరో నేతను నియమించినా నిమ్మకున్నట్లు వ్యవహరించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఇతర అంశాలను, విపక్షాల రాజకీయ విమర్శలను పట్టించుకునే పరిస్థితుల్లో ఆయన లేరన్న మాటలు వినిపిస్తున్నాయి. దాదాపుగా విపక్షాల విమర్శలకు ఆయన సమాధానం చెప్పకుంటే మౌనమే అంగీకారమన్న అభిప్రాయం ఉన్నది.
బదిలీకి సిద్ధపడుతున్న అధికార యంత్రాంగం
కానీ ప్రస్తుతానికి కేంద్ర మంత్రికిగానీ, ఆయన అనుచరులకు గానీ ఇటు ప్రజలకు, అటు విపక్షాలకు సమాధానం చెప్పే తీరిక లేదు. జిల్లాలో తమ పనులు చేయించుకుని నచ్చని వారిని వేధించడం, వచ్చిన నిధులను తమకు అనుకూలంగా ఖర్చు చేసుకోవడంలో వారు చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అశోక్ గజపతి రాజు కోట నుంచి ఆయన అనుచరులుగా ఉన్నవారిలో అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ మొత్తం చక్రం తిప్పుతున్నారు. వీరి ఒత్తిళ్లు ఇప్పుడు అధికారులకు వేధింపులుగా మారాయి. అందుకే ‘ఇక్కడ పనిచేయలేం మహాప్రభో' అని వెళ్లిపోవడానికే మొగ్గు చూపిస్తున్నారు.
Recommended Video
అనుచరుల తీరుపై అధికారుల అయోమయం
కీలక పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులకు ముఖ్య అనుచరులు ఉండటం సహజమే అలాగే చాలావరకూ కార్యకలాపాలు వారి ద్వారా చక్కబెట్టడం సాధారణం. కానీ అవి హద్దులు దాటితే ఇక భరించడం ఎవరి తరం కాదు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజు అనుచరుల ఆగడాలు అలానే పెచ్చుమీరుతున్నాయి. మంత్రికి తెలిసో లేక తెలియకుండానో వీరు చేస్తున్న పనులు జిల్లా స్థాయి అధికారులను సైతం కలవరపరుస్తున్నాయి. అన్నింటిలోనూ తలదూరుస్తూ, అభివృద్ధి పనులకు అడ్డుతగులుతున్నారు. ఇక వారికి ఎదురు చెప్పలేక... వాటిని పాటించలేక ఇక్కడినుంచి బదిలీ చేయించుకుని వెళ్లిపోవాలనే యోచనలో పలువురు అధికారులు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో స్పష్టమవుతోంది.
అధికారులపై ఇలా ఒత్తిడి
కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అనుచరుల్లో ముఖ్యులు ఇద్దరిదే రాజ్యం. అధికారులనెత్తినెక్కి కూర్చున్నారు. కొన్ని నెలల క్రితం వీధి దీపాల కాంట్రాక్టు విషయంలో తాను చెప్పిన వ్యక్తికి కాంట్రాక్టులో భాగం ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారిని భయపెట్టారు. అదే విషయంలో చీఫ్ ప్లానింగ్ అధికారిపైనా ఒత్తిడి తెచ్చారు. జిల్లాలోని ఓ మున్సిపల్ కమిషనర్ తమకు అనుకూలంగా ఉండటం లేదన్న కారణంతో ఆయనపై ఏసీబీని ప్రయోగించి కేసులు పెట్టించారనే అపవాదునూ మూటగట్టుకున్నారు. తాజాగా జిల్లా అధికారి ఒకరిని ఫోన్లో బెదిరించారు.
ఎంపీ లాడ్స్ ఖర్చుపై అనుయాయులదే నిర్ణయాధికారం
విజయనగరం జిల్లా కేంద్రంలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి విడుదలైన రూ.కోట్ల నిధులను ఖర్చు చేయవద్దనేది ఆ బెదిరింపు సారాంశం. ఎంతోమంది యువతీ యువకులతో ముడిపడి ఉన్నా ఆ పని చేయడం వల్ల తమకు ఉపయోగం లేదనే ఒకే ఒక్క కారణంతో దానిని జరగనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆ అధికారి అంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే సాగితే బదిలీ చేయించుకుపోవడం తప్ప తమకు వేరే గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో నేత సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో తమ వాటాలు తెప్పించుకోవడంలో ఈయన దిట్ట. ఎంపీ లాడ్స్ ఎక్కడెక్కడ ఖర్చు చేయాలి, ఏ శాఖకు కేటాయించాలనేది ఈయనే నిర్ణయించాలి మరి. ఏ అధికారైనా తాను చెప్పిన వారికి కాంట్రాక్టు ఇవ్వకపోయినా, అడిగిన వాటా అందించకపోయినా తిట్ల దండకం అందుకుంటారట.
కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ
ఒక నాయకుడికి సాక్షాత్తూ గత జాయిట్ కలెక్టర్పైనే చిందులు తొక్కిన చరిత్ర ఉంది. జాతీయ స్థాయిలో జరిగిన ఓ కుంభకోణంలో అతని కాల్ లిస్ట్పై అనుమానాలు రావడంతో కొంతకాలంగా దూకుడుకు కళ్లెం పడింది. జిల్లా స్థాయిలో మాత్రం అతని హవా కొనసాగుతూనే ఉంది. వీరిద్దరి ఆగడాల గురించి మంత్రికి ఫిర్యాదు చేసేందుకు ఎవరూ సాహసించడం లేదు. ‘పెద్దాయనకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా? అని ఎందుకొచ్చిన గొడవలే' అని ఎవరికి వారు తమలో తామే బాధపడుతున్నారు.