'కేసీఆర్పై అసంతృప్తి, 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు!', కేటీఆర్ ఫోన్, జగన్ ఓకే
హైదరాబాద్: జూన్ 1వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పైన ఉత్కంఠ కనిపిస్తోంది. ఆరు స్థానాలు ఖాళీ ఉండగా ఏడుగురు బరిలో నిలిచారు. తమ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
తెరాస ఐదు, కాంగ్రెస్ ఒకటి, టీడీపీ ఒక స్థానంలో పోటీ చేస్తోంది. తెరాస తమ బలం కంటే ఒకరిని ఎక్కువగా నిలబెట్టిందని, ఇది సరికాదని కాంగ్రెస్, టీడీపీలు మండిపడుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన దాని ప్రకారం కాంగ్రెస్, టీడీపీలు ఒక్కో స్థానాన్ని కచ్చితంగా గెలుచుకుంటారు. అయితే, ఆ తర్వాత ఇరు పార్టీల నుండి ఏడుగురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. దీంతో అసలు చిక్కు వచ్చి పడింది.
దీంతో కాంగ్రెస్, టీడీపీకి ఎక్కువ చిక్కు వచ్చి పడింది. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే ఉద్దేశ్యంలో భాగంగా టీడీపీ, కాంగ్రెస్లు తెరాసలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయకుండా ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ వారికి చుక్కెదురయింది.
ఈ నేపథ్యంలో తమ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. తెరాస, కాంగ్రెస్ పార్టీలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా, కేసీఆర్ పైన నిప్పులు చెరుగుతున్న టీడీపీ ఎలాగైన తమ అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏడాది పాలన పైన దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారు తమ అభ్యర్థికే ఓటు వేస్తారని చెప్పడం గమనార్హం.
జగన్కు కేటీఆర్ ఫోన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఫోన్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని ఆయన కోరారు. అందుకు జగన్ సానుకూలంగా స్పందించారు.