ఎమ్మెల్యే అఖిలప్రియపై దాడి: 8మంది అరెస్ట్
రాజధాని అమరావతి ప్రాంతంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియపై దాడి ఘటనలో 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియపై దాడి ఘటనలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల పుటీజీ ఆధారంగా 8 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అఖిలప్రియ గురువారం సచివాలయానికి వెళ్తుండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆమె వాహనంపై దాడి చేశారు. మొదట వెలగపూడిలోని సచివాలయానికి వెళ్తున్న అఖిలప్రియను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. అతి కష్టం మీద పోలీసులు, గన్మెన్ల సాయంతో ఆమె సచివాలయానికి చేరుకున్నారు.
ఘటనపై ఎమ్మెల్యే అఖిలప్రియ గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ వైసీపీ నుంచి టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.
ప్రతిపక్ష నేత జగన్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుండటంతో వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొందరు కార్యకర్తలు ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమె వాహనంపై దాడి చేశారు.
కాగా, ఈ ఘటనపై తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ స్పందించారు. మహిళా ఎమ్మెల్యేను అడ్డుకోవడం మంచి పని కాదన్నారు. దౌర్జన్యకర శక్తులను ఎదగనివ్వం, ఇలాంటి దుష్ట శక్తులను తరిమి కొట్టాలని హెచ్చరించారు.