దాడులు కొత్తేమీ కాదు: వనజాక్షిపై దాడి మీద అశోక్ బాబు స్పందన
హైదరాబాద్: కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడిపై ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు గమ్మత్తుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులపై దాడులు జరగడం కొత్తేమీ కాదంటూ వనజాక్షిపై జరిగిన దాడిని తేలిగ్గా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు.
గత ప్రభుత్వాల్లో కూడా ప్రభుత్వోద్యోగులపై దాడులు జరిగాయని ఆయన అన్నారు. వనజాక్షిపై జరిగిన దాడి ఘటన మీద ప్రభుత్వం విచారణ కమిటీని వేసిందని ఆయన గుర్తు చేశారు. ఎపిలో ఉద్యోగుల బదిలీలను ఆగస్టులో చేయడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఉద్యోగులను కూడా సంప్రదించాలని ఆయన కోరారు. ప్రభుత్వ భవనాలను కట్టి నతర్వాత రాజధానిని ఎపికి తరలించాలని తాము గతంలోనే ప్రభుత్వాన్ని కోరామని ఆయన చెప్పారు.
ఏయే శాఖలను, ఎంత మంది ఉద్యోగులను తరలిస్తారో తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తాము తెలియజేస్తామని అశోక్ బాబు అన్నారు.