భూమాపై హత్యయత్నం కేసు: అరెస్టుకు మోహరింపు
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో చోటు చేసుకున్న తోపులాట, ఘర్షణ నేపథ్యంలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం, దాడి కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసేందుకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనను అరెస్టు చేసేందుకు రాత్రికి రాత్రి ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.
నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ శుక్రవారంనాడు తెలుగుదేశం పార్టీకి చెందిన చైర్పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన సమావేశమైంది. వైయస్సార్ సిపి ఫ్లోర్ లీడర్ అనూష సమావేశానికి గైర్హాజరు కావడంతో ఆమె స్థానంలో డిప్యూటీ నేత వాకా శివశంకర్, మరో కౌన్సిలర్ కృపాకర్ కూర్చున్నారు. వారు వెనక కుర్చీల్లోకి వెళ్లాలని టిడిపి కౌన్సిలర్లు గొడవకు దిగారు.
శివశంకర్ సమాధానం చెబుతుండగా ఆయనను సస్పెండ్ చేస్తానంటూ చైర్పర్సన్ హెచ్చరించారు. ఇంతలో సమావేశానికి భూమా నాగిరెడ్డి వచ్చారు. వివాదాన్ని తగ్గించడానికి అంటూ శివశంకర్ కుర్చీలో కూర్చోవాలని సూచించారు. గొడవ నేపథ్యంలో ఎజెండా చేపట్టకుండానే సమావేశం ముగిసిందని చైర్పర్సన్ ప్రకటించారు.
అయితే, భూమా నాగిరెడ్డి కల్పించుకుని తాను పట్టణ సమస్యలపై చర్చించాల్సి ఉందని పట్టుబట్టి మాట్లాడడం ప్రారంభించారు. అయితే, సమావేశం ముగిసిందని చైర్పర్సన్ బెల్ కొట్టారు. దాంతో పాటు ఆమె భర్త, కోఆఫ్షన్ సభ్యుడు దేశం సుధాకర్ రెడ్డి - ఎమ్మెల్యే ప్రసంగం వినాల్సిన అవసరం లేదని అన్నారు. దీనికి వైయస్సార్ కాంగ్రెసు కౌన్సిలర్లు అభ్యంతరం చెప్పారు. దాంతో గొడవ ప్రారంభమైంది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కుర్చీలు విసురుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఘటనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన కౌన్సిలర్లు ముర్తుజా, కరీముల్లా గాయపడ్డారు. టిడిపి కౌన్సిలర్లు వెంకటసుబ్బయ్య, మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్ కూడా గాయపడ్డారు. చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్ చాంబర్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.
అంతకు ముందు చైర్పర్సన్, టిడిపి కౌన్సిలర్లు ఎఎస్పీ సన్ప్రీత్సింగ్కు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ రవికృష్ణ నంద్యాల చేరుకుని పరిస్థితిని సమీక్షించారు అధికార పార్టీ నేతల ఫిర్యాదు మేరకు శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిపై పోలీసులు హత్యాయత్నం, దాడి కేసులు నమోదు చేశారు. శుక్రవారం భూమాను అరెస్టు చేసేందుకు వారంట్ తీసుకుని పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. అయితే, ఆయన ఇంట్లో లేకపోవడంతో అక్కడే కాపు కాశారు.
నంద్యాల తీవ్ర ఉద్రిక్తత
భూమా నాగిరెడ్డిపై కేసు నమోదు చేయడంతో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమా నాగిరెడ్డి ఇంటి చుట్టూ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. అయితే, నాగిరెడ్డి ప్రస్తుతం అందుబాటులో లేరు. జిల్లా ఎస్పీ స్వయంగా నంద్యాలకు చేరుకుని ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మరోవైపు, తెలుగుదేశం పార్టీ నంద్యాల బంద్కు పిలుపునిచ్చింది. శుక్రవారంనాటి మునిసిపల్ సమావేశంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు రాత్రికి మరింత తీవ్రంగా మారాయి. కాగా, సుబ్బారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలలో భారీగా పోలీసులు మోహరించారు.