ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్నకు ఆటో డ్రైవర్ యత్నం
విజయవాడ: విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన ఆ విద్యార్థిని వేములవలసలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ చదువుతున్నది. ఈ నెల 18న కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆ బాలిక తండ్రి బుధవారం స్థానిక పోలీసులకు ఆటో డ్రైవర్ చుక్క రమణపై ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం రమణ ఆటోలో ఆ విద్యార్థినిని తీసుకువెళుతుండగా వేములవలస జంక్షన్లో వెంబడించి అదుపులోకి తీసుకుని ఆ విద్యార్థినిని విడిపించారు. వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్కు తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి
ఇదిలావుంటే, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గల రెండు మండలాల్లో గురువారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను బలిగొన్నాయి. నర్సీపట్నం మున్సిపాలిటీలోని శివపురం ప్రాంతానికి చెందిన కలప వ్యాపారి తానేటి జీసస్ స్టాలిన్బాబు తనయుడు తానేటి స్టాలిన్ స్లీమన్స్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శ్రీ వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఇతని తల్లి హేమంత నాతవరం మండలం తాండవలో ఎఎన్ఎంగా పని చేస్తున్నారు.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కళాశాల నుంచి తల్లిదండ్రుల వద్దకు వచ్చిన స్లీమెన్స్తోపాటు అతని సోదరుడు సురేష్పీటర్ ద్విచక్ర వాహనంపై తాండవ నుంచి నర్సీపట్నంలో ఉంటున్న నాన్నమ్మ ఇంటికి వస్తుండగా నర్సీపట్నం మున్సిపాలిటీ శివారు కృష్ణాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్లీమెన్స్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో సురేష్పీటర్కు తీవ్ర గాయాలు కావడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ టర్నింగ్ వద్ద అదుపు చేయలేక కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
నీట మునిగి మృతి
కలువ పువ్వుల కోసమని చెరువులో దిగిన ఇద్దరు బాలలు నీటమునిగి మృతిచెందిన ఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలం చినబోరబందలో గురువారం జరిగింది. నాల్గో తరగతి చదువుతున్న పిరిడి పోలిరాజు (9), వంగపండు గణేష్ (9)లు గ్రామానికి సమీపంలో ఉన్న బక్కివాని చెరువుకు వెళ్లి అందులోని కలువ పువ్వుల కోసం ఈదుకుంటూ లోపలకు వెళ్లారు. నీటిలోని పొదల్లో చిక్కుకున్న వారు ఊపిరాడక మృతి చెందారు.