టిడిపి జిల్లా అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నారు: కడప కలెక్టర్పై ఎంపి అవినాశ్ ఫైర్
కడప: జిల్లాలో కలెక్టర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ రమణను బదిలీ చేయాలని ఇప్పటికే ఎంపీ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్.. వైయస్సార్ కాంగ్రెస్ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ వైయస్ అవినాష్ ఆరోపించారు.
కడప జిల్లా కలెక్టర్ జిల్లా టిడిపి అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నారని ఎంపి వైయస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను పిలవడం లేదని ఆయన ఆరోపించారు.
కలెక్టర్ కుట్రపూరితంగానే జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈ విషయంపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశామని తెలిపారు. దివంగత సిఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 80 శాతం పూర్తిచేసి కడపకు 44 వేల క్యూసెక్కుల నీరు అందించారని చెప్పారు.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండా మంత్రి దేవినేని ఉమ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. గాలేరు నగరి పనులు తక్షణమే పూర్తి చేయాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, రాయితీలు ఇచ్చేలా పార్లమెంట్ లో పోరాడుతామని తెలిపారు.