గుంటూరు వద్దంటే విశాఖ: పవన్కు ధీటుగా అయ్యన్న
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇచ్చారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని ఆయన తెలిపారు. ఒకవేళ గుంటూరులో రాజధాని వద్దనుకుంటే విశాఖపట్నంలో నిర్మించాలన్నారు. అక్కడ భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
పవన్ వ్యాఖ్యలు స్వాగతిస్తున్నాం: హరిబాబు
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తామని చెప్పారు. ఎంపీలమంతా కలసికట్టుగా కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న అమలు చేసే విషయంలో ఇప్పటికే కేంద్రం కార్యాచరణ ప్రారంభించిందని చెప్పారు. ఏపీ అభివృద్ధి బాటకు మోడీ సర్కారు సహకరిస్తుందని చెప్పారు.
కాగా, పవన్ కళ్యాణ్ గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన నాలుగు గ్రామాల్లో పర్యటించి రైతుల బాధలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కోవద్దని చెప్పారు.
అనంతరం శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు చెప్పారు. తాను కూడా రైతునే అని, రైతులకు ఇష్టమైతే రాజధాని కోసం భూసేకరణ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. సింగపూర్కు మించిన రాజధాని నిర్మించాలనుకోవడం సంతోషకరమన్నారు. అయితే గ్రామాలు ఉండాలని, గ్రామాభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానన్నారు. తాను వ్యక్తిగతంగా 2024 వరకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు.