ఎన్టీఆర్తో కలిసి నటించిన మొదటితరం నటీనటులను ఘనంగా సత్కరిస్తాం: బాలకృష్ణ
అమరావతి: ఎన్టీఆర్తో కలిసి నటించిన మొదటితరం నటీనటులను ఘనంగా సన్మానించనున్నట్లు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అంతర్జాతీయ ఖ్యాతి వచ్చేలా లేపాక్షి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 27, 28 తేదీల్లో నిర్వహించనున్న లేపాక్షి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు చెప్పారు. ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్తో కలిసి నటించిన మొదటితరం నటీనటులను సత్కరిస్తామని ఆయన వెల్లడించారు.
లేపాక్షి ఉత్సవాలకు జాతీయ స్థాయి నేతలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ముఖ్య నేతలను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో నిర్వహించనున్న లేపాక్షి ఉత్సవాల నిర్వహణలో మునిగిపోయారు.
ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ఉత్సవాలకు బాలకృష్ణ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు ఏపీలోని విశాఖ, విజయవాడలతో పాటు హైదరాబాద్లోని పలువురు ప్రముఖులను లేపాక్షి ఉత్సవాలకు ఆహ్వానించిన బాలకృష్ణ తాజాగా ఢిల్లీకి చేరారు.
కేంద్రంలో ఇప్పటికే వెంకయ్యనాయుడు సహా పలు కీలక మంత్రులకు ఆయన లేపాక్షి ఆహ్వానాలను అందించారు. తాజాగా గురువారం ఆయన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేపాక్షి ఉత్సవాలకు రావాలని ఆహ్వానం అందించారు.
ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఏలూరు ఎంపీ మాగంటి బాబులతో కలిసి గడ్కరీ వద్దకెళ్లిన బాలకృష్ణ, ఆహ్వాన పత్రికను అందించారు.