ముష్టిపడేసి: బీజేపీకి బాలకృష్ణ ఘాటు హెచ్చరిక: అప్పుతేలేం: యనమల
అనంతపురం/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పైన హిందూపురం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర బడ్జెట్ పైన కేంద్ర బడ్జెట్ ప్రభావం ఉంటుందని చెప్పారు.
బాలకృష్ణ మాట్లాడుతూ.. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. రూ.100 కోట్లు ఇచ్చి పోలవరం ప్రాజెక్టును కట్టుకోమని చెబితే ఎలా అని ప్రశ్నించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఏపీకి న్యాయం చేయాలన్నారు.
నిధుల కోసం అవసరమైతే అఖిల పక్షంతో ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ఇతర రాష్ట్రాలకు లేని ఇబ్బంది ఒక్క ఆంధ్రప్రదేశ్కే ఎందుకు అని బాలకృష్ణ ప్రశ్నించారు.పోలవరంకు కేవలం వంద కోట్లు ముష్టిపడేస్తే ఎలా అన్నారు.
రాష్ట్ర బడ్జెట్ పైన కేంద్ర బడ్జెట్ ప్రభావం: యనమల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ పైన కేంద్ర బడ్జెట్ ప్రభావం ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వేరుగా తెలిపారు. ఈసారి కూడా లక్ష కోట్ల బడ్జెట్ ఉంటుందన్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీని తాము ఓసారి కలుస్తామని చెప్పారు.
ఇప్పుడు ఎక్కడా అప్పులు తీసుకునే పరిస్థితి కూడా లేదని చెప్పారు. రాజధాని నిర్మాణానికి కేటాయింపుల పైన ఎలాంటి స్పష్టత లేదని చెప్పారు. 12వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెడతామని చెప్పారు. 13వ తేదీన వ్వయసాయం, అనుబంధ రంగాల బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు.