ఏపీ కష్టాల్లో ఉన్నా బాబు కోట్లు ఖర్చు: బాలకృష్ణ, జేసీ హెచ్చరిక
అనంతపురం: సినిమాల్లో చెప్పడానికే పరిమితం కాదని, దానిని చేసి చూపించే సత్తా తమకే ఉందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంగళవారం నాడు అన్నారు. హిందూపురం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన రెండో రోజూ పర్యటించారు.
ముద్దిరెడ్డిపల్లిలో నాలుగు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు.
ఆ తర్వాత అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విభజనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా సీఎం చంద్రబాబు రూ.కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు.
కాగా తాను నటించబోయే 101వ చిత్రం పేరు రైతు అని బాలకృష్ణ ప్రకటించారు. రైతు ఉపశమన అర్హత పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ప్రకటన చేశారు. దేశానికి రైతే వెన్నెముక అని, భూమి దుక్కి దున్ని, ఆరుగాలం పకష్టపడి పండించిన పంటతో దేశానికి అన్నం పెడుతున్నది రైతు అన్నారు.
కేంద్రానికి జేసీ హెచ్చరిక
టిడిపి నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం నాడు హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్ర విభజన వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు ఇచ్చే ప్యాకేజీలో తమ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు అధిక ప్రాధాన్యత ఇవ్వకుంటే పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తామన్నారు.