కేంద్రంపై తొడగొట్టిన బాలయ్య: చంద్రబాబుకు తెలిసేనా, కాదా?
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి బావమరిది తొడగొట్టడం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయడానికి వ్యూహాత్మకంగా అధికార తెలుగుదేశం పార్టీ కేంద్రంపై దూకుడుగా వ్యవహరిస్తుందనే అభిప్రాయం ఓ వైపు ఉన్నప్పటికీ మరో కోణం కూడా ఉండవచ్చుననే ప్రచారం సాగుతోంది. ఓ వైపు జగన్ కేంద్రాన్ని సాకుగా తీసుకుని కేంద్ర బడ్జెట్, కేటాయింపుల విషయంలో తమపై విరుచుకుపడకుండా అడ్డుకుంటూనే తామే స్వయంగా కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహం కూడా ఉండవచ్చునని భావిస్తున్నారు.
బాలకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముష్టిపడేసి పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలంటే ఎలా అని బాలకృష్ణ సోమవారంనాడు కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాపై ఇతర రాష్ట్రాలకు లేన ఇబ్బంది ఎపి విషయంలోనే వచ్చిందా అని కూడా ఆయన ప్రశ్నించారు. తన తండ్రి ముందుకు తెచ్చి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆయన మరోసారి తెర మీదికి తెచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తే జనం తిరగబడుతారని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు.
బాలకృష్ణ అంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం వెనక గల ఆంతర్యమేమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. చంద్రబాబుకు తెలిసే బాలకృష్ణ ఆ వ్యాఖ్యలు చేశారా, చంద్రబాబు వ్యూహంలో భాగంగానే చేశారా అనేది తెలియడం లేదు. అయితే, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి కూడా అంతే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రభుత్వంలో కొనసాగే విషయంపై పునరాలోచన చేస్తామని వారన్నారు. చంద్రబాబుకు తెలియకుండా అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసేందుకు వారిద్దరు ముందుకు రారనే మాట వినిపిస్తోంది. బాలకృష్ణ కూడా ఆ వ్యూహంలో భాగంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు భావించడానికి కూడా వీలుంది.
కాగా, ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై, పోలవరం ప్రాజెక్టుకు కేవలం వంద కోట్లు మాత్రమే కేటాయించడంపై, విభజన హామీల విషయంలో కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల్లో కూడా అసంతృప్తి చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోని అంతర్గత అసంతృప్తిని చల్లాచర్చడానికి కూడా వ్యూహాత్మకంగా బాలయ్య ముందుకు వచ్చారా అనేది కూడా తెలియడం లేదు.
బాలకృష్ణ కూడా కేంద్రంపై దూకుడుగా వ్యవహరిస్తున్నారంటే పార్టీలోని అసంతృప్తివాదులు కాస్తా సంతృప్తి చెందే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. చంద్రబాబు స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయింపులపై ఆవేదన వ్యక్తం చేస్తూ కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనక కూడా ప్రతిపక్షాలను, సొంత పార్టీలోని అసంతృప్తి వర్గాన్ని కార్నర్ చేసే అలోచన ఉండవచ్చునని అంటున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తి పేరుకుపోయి, చంద్రబాబు తనంత తానుగా ఎన్డిఎ నుంచి తప్పుకునే ఏర్పాటును బిజెపియే స్వయంగా చేసి ఉండవచ్చుననే వ్యాఖ్యలు కూడా వినవస్తున్నాయి. ఏమైనా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం వేడెక్కాయి. బిజెపి, తెలుగుదేశం పార్టీ సంబంధాల మధ్య ఈ పరిణామం ఎటు దారి తీస్తుందోననే ఆసక్తి కూడా నెలకొని ఉంది.