బాలకృష్ణ మూడు నెలల తర్వాత వచ్చారు: చిర్రుబుర్రులాడారు
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణ మూడు నెలల తర్వాత తన సొంత నియోజకవర్గం హిందూపురం వచ్చి సందడి చేశారు.
అనంతపురం: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణ మూడు నెలల తర్వాత తన సొంత నియోజకవర్గం హిందూపురం వచ్చి సందడి చేశారు. ఆయన శుక్రవారంనాడు, శనివారంనాడు హిందూపురంలో పర్యటించారు.
శుక్రవారంనాడు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, తన అభిమానులపై చిర్రుబుర్రులాడారు. దీంతో పలువురు ఆయనకు ఎదురుపడడానికి ఇబ్బంది పడ్డారు. మొదట ఆయన మండల కేంద్రం చిలమత్తూరు నుంచి బైకుపై ప్రయాణించారు.
ఆ సమయంలో ఆయన లేపాక్షిలో ఓ పోలీసు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత హిందూపురం ప్రభుత్వాస్పత్రి భవనాన్ని ప్రారంభించారు.
ఫొటోలకు అడ్డువస్తున్నాడని....
ప్రభుత్వాస్పత్రి భవనం ప్రారంభ సమయంలో ఫొటోలకు అడ్డు వస్తున్నాడని 11వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ రామ్మూర్తిపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న ఆస్పత్రి సూపరింటిండెంట్ కేశవులను దూరం జరగాల్సిందిగా ఆదేశించారు.
పూజలు జరిగే సమయంలోనూ....
పూజ జరిగే సమయంలో ఓ అర్చకుడిపై బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రోజుల్లో కూడా ఆయన ఇలాగే చిర్రుబుర్రులాడేవారని చెబుతారు. హిందూపురంలో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో రూ.20.15 కోట్లతో మాతా శిశు వైద్యశాలను నిర్మించారు. దాన్ని బాలకృష్ణ ప్రారంభించారు.
టూటౌన్ పోలీసు స్టేషన్...
హిందూపురం పట్టణంలో నిర్మించిన టూటౌన్ పోలీస్స్టేషన్ నూతన భవనాన్ని బాలకృష్ణతో పాటు డీజీపీ సాంబశివరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నిమ్మల కిష్టమ్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్ మొయినుద్దీన్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులుతోపాటు పలువురు పాల్గొన్నారు.
బుల్లెట్ నడుపుతూ...
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుల్లెట్ వాహనం నడుపుతూ సందడి చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గ పర్యటన నిమిత్తం శుక్రవారం ఉదయం వచ్చిన ఆయన కొడికొండ చెక్పోస్టు నుంచి లేపాక్షి వరకు 13 కిలోమీటర్లు బుల్లెట్ నడిపారు.