హోదాపై హరికృష్ణతో విభేదించిన బాలయ్య: చంద్రబాబు వైఖరే...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంపై నందమూరి సోదరులు బాలకృష్ణ, హరికృష్ణ పరస్పర విరుద్దమైన ప్రకటనలు చేశారు. బావ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పట్ల వారు తీసుకున్న భిన్న వైఖరులు ఆ ప్రకటనల్లో ప్రతిబింబించాయని అంటున్నారు. బాలయ్య చంద్రబాబుకు అనుకూలంగా వ్వవహరిస్తున్నారు. హరికృష్ణ దాదాపు చంద్రబాబు నాయుడికే కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా దూరమైనట్లు కనిపిస్తున్నారు.
తనకు టిడిపి మహానాడు కన్నా ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్యమని హరికృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఆయన హాజరు కాలేదు. కాగా, తిరుపతిలో జరుగుతున్న మహానాడులో బాలకృష్ణ పాల్గొంటున్నారు. హోదా సాధన కోసం ఇంటికి ఒకరు చొప్పున ఉద్యమం చేయాలని నందమూరి హరికృష్ణ వ్యాఖ్యానించారు.
హోదా విషయంలో సంయమనం పాటించాలని, బీజేపీతో మాట్లాడతామని హరికృష్ణ తమ్ముడు బాలకృష్ణ అన్నారు. హోదాను ఇస్తామన్న వారు మోసం చేశారని, తెస్తామన్న వారు ఏం చేస్తున్నారని హరికృష్ణ అన్నారు. టిడిపి మహానాడుకు గైర్హాజరైన హరికృష్ణ తనకు తన తండ్రి జయంతి కంటే ముఖ్యమైన కార్యక్రమం ఏం ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు తిరుపతి టౌన్క్లబ్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి బాలకృష్ణ క్షీరాభిషేకం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు.
మరోవైపు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు. సర్వమతప్రార్థనలు చేశారు. ఎన్టీఆర్ కుమారులు హరికృష్ణ, రామకృష్ణ, కుమార్తెలు పురందేశ్వరి, భువనేశ్వరి, అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, మనవలు కళ్యాన్రామ్, తారకరత్న, బ్రహ్మణి తదితరులు నివాళులర్పించారు.