27, 28న నంది ఉత్సవాలు: 'బాలకృష్ణ కృషితోనే లేపాక్షికి పూర్వ వైభవం'
హిందూపురం: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కృషితోనే చారిత్రత్మాక ప్రాంతమైన లేపాక్షికి పూర్వవైభవం వచ్చిందని బీసీ కార్పోరేషన్ ఛైర్మన్ రంగనాయకులు అన్నారు. శుక్రవారం స్థానిక గజాగుండంవద్ద కోనేరు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రంగనాయకులు మాట్లాడుతూ గతంలో నిర్వహించిన నంది ఉత్సవాలకంటే ఈసారి రెట్టింపు ఉత్సాహాంతో నిర్వహించడం కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక చొరవ చూపారన్నారు. లేపాక్షి ఉత్సవాల కోసం కోట్లాదిరూపాయలు వెచ్చించి పలు అభివృద్ది పనులు చేపట్టారని కొనియాడారు.
శిల్పకళాసంపదను కాపాడుకునేలా తీసుకున్న చర్యలు చాలా సంతృప్తి కరంగా ఉన్నాయన్నారు. ఈ శంకుస్థాపన పనులకు ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్, ఎంపీపీ హనోక్, సర్పంచ్ జయప్పలు హాజరయ్యారు. కాగా, ఈ నెల 27, 28న లేపాక్షిలో నంది ఉత్సవాలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది.
లేపాక్షి నంది ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఈనెల 4వ తేదీన ఢిల్లీకి వెళ్లి బాలకృష్ణ కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని ఆహ్వానించారు. లేపాక్షి ఉత్సవాలకు ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2వ తేదీన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ను కలిసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
వీరితో పాటు తెలంగాణ దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రలను కూడా ఆహ్వానిస్తామన్నారు. కర్ణాటక నుంచి కూడా మంత్రులు రానున్నట్లు బాలకృష్ణ చెప్పారు. వారందరినీ లేపాక్షి ఫెస్టివల్లో గౌరవించడం జరుగుతుందన్నారు.