"ఆంధ్రజ్యోతి నిస్సిగ్గు పాత్రికేయం.. వాస్తవాలను ఏమార్చి జగన్పై విషం.."
ఉద్దేశపూర్వకంగా జగన్ ప్రతిష్టను మసకబార్చేలా ఆంధ్రజ్యోతి వ్యవహరిస్తోందని, ఆ పత్రిక చేస్తున్నది క్షమించరాని నేరం అని అన్నారు.
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి పత్రిక ఉద్దేశపూర్వకంగా వైసీపీ అధినేత జగన్ పై బురద జల్లుతోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. వాస్తవాలను వక్రీకరించి.. అసత్య ప్రచారాల ద్వారా పాత్రికేయ విలువలను పూర్తిగా దిగజార్చేలా ఆ పత్రిక వ్యవహరిస్తోందని భూమన అన్నారు.
ఇటీవల మోడీతో జగన్ భేటీ నేపథ్యంలో టీడీపీలో కలవరం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో తమ అనుకూల మీడియాతో జగన్ పై పనికట్టుకుని వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. దానికి తగ్గట్లుగానే ఆంధ్రజ్యోతి పత్రిక లేని పోని కథనాలను వండి వారుస్తోందని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవాలు ఇలా!:
ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే అధికారులు టీడీపీ తొత్తులుగా మారారని వైఎస్ జగన్ ఫిబ్రవరి 17న ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ లేఖపై ఏప్రిల్ 13న కేంద్రం నుంచి జవాబు వచ్చిందన్నారు. ప్రధానికి జగన్ సమర్పించిన వినతిపత్రాన్ని కూడా అన్ని దినపత్రికలకు ఇచ్చామని, అందులో అగ్రిగోల్డ్, ప్రత్యేక హోదా అంశాలను ప్రస్తావించారని తెలిపారు.
ఆంధ్రజ్యోతి నిస్సిగ్గు రాజకీయం:
వాస్తవాలు ఇలా ఉంటే, ఆంధ్రజ్యోతి మాత్రం నిస్సిగ్గుగా వార్తలు రాసిందని భూమన మండిపడ్డారు. ఫిబ్రవరి 17న రాసిన లేఖను వైఎస్ జగన్ మే10న ప్రధానికి ఇచ్చినట్లు ఆంధ్రజ్యోతి చిత్రీకరించిందన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ ప్రధానిని కలిస్తే.. దిగజారుడు తనంతో ఆంధ్రజ్యోతి కథనాలు రాస్తోందన్నారు.
దిగజారుడు పత్రిక:
జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనేంత శక్తి లేకనే ఆంధ్రజ్యోతి ఆయనపై, వైసీపీ పార్టీపై తప్పుడు కథనాలు రాస్తోందని భూమన ఆరోపించారు. ఆంధ్రజ్యోతి దిగుజారుడు పాత్రికేయంపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. క్రిమినల్ డిఫేమేషన్ కింద(పరువు నష్టం) కింద కేసు వేస్తామని తెలిపారు.
ఆంధ్రజ్యోతిని బహిష్కరణ
ఏబీన్ చానెల్, ఆంధ్రజ్యోతి పత్రిక గత మూడేళ్లుగా వైఎస్ జగన్ తో పాటు వైసీపీపై విషం కక్కుతూనే ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగా జగన్ ప్రతిష్టను మసకబార్చేలా ఆంధ్రజ్యోతి వ్యవహరిస్తోందని, ఆ పత్రిక చేస్తున్నది క్షమించరాని నేరం అని అన్నారు.
మూడేళ్లుగా విషం కక్కుతూ:
ఆంధ్రజ్యోతి పత్రికతో పాటు, ఏబీఎన్ చానెల్ ను గ్రామ స్థాయి నుంచి అన్ని స్థాయిల వరకు బహిష్కరిస్తున్నట్లు భూమన ప్రకటించారు. వైసీపీ పార్టీ కార్యాలయాలకు ఇకనుంచి ఆంధ్రజ్యోతి విలేకరులు రావాల్సిన అవసరం లేదని సూచించారు. ఆంధ్రజ్యోతి అంత సిగ్గుమాలిన పత్రిక ప్రపంచంలో మరొకటి లేదని అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి వార్తలు రాయాలని హితవులు పలికారు. ఫిబ్రవరి 17న జగన్ రాసిన లేఖను, మే10న మోడీకి ఇచ్చిన లేఖను ఆంధ్రజ్యోతికి పంపిస్తామని పేర్కొన్నారు.