'కాపులను బీసీల్లో చేర్చడం అవసరమా': చంద్రబాబుకు తలనొప్పి
అమరావతి: రాజ్యాంగంలోని ప్రకరణ 340 ప్రకారం సాంఘీకంగా, విద్యాపరంగా వెనుకబడిన వారినే బీసీలుగా గుర్తించాలని, అయితే ఎన్నికల ప్రణాళికలో వాగ్ధానం చేశామనే కారణంతో కాపులను బీసీల్లో చేర్చాల్సిన అవసరం ఉందా అని ప్రభుత్వాన్ని బీసీ సంఘం అధ్యక్షులు కేశన శంకర రావు ప్రశ్నించారు.
కాపు రిజర్వేషన్ అంశం పైన ఓ వైపు ముద్రగడ పద్మనాభం, మరోవైపు బీసీ సంఘాల మధ్య చంద్రబాబు ఇరుకున పడిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లు ఇవ్వవద్దని బీసీ సంఘాలు, హామీ మేరకు ఇవ్వాలని కాపులు డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు నష్టం లేకుండా రిజర్వేషన్లు ఇస్తామని టిడిపి చెబుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా కేశన శంకర రావు మాట్లాడారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందిన వారికి బీసీ కోటా కల్పిస్తే కోర్టుల తీర్పును ధిక్కరించినట్లవుతుందన్నారు. రాబోయే కాలంలో బీసీలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.