ప్రజల్నే..: కేసీఆర్పై లోకేష్, పెప్సీలో నాయిని ఓటమి
హైదరాబాద్: విద్యుత్ సమస్యను పరిష్కరించలేక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శిస్తున్నారని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ శనివారం విమర్శించారు.
ఎన్నికలకు ముందు మూడు నెలల్లో విద్యుత్ సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మూడేళ్లు పడుతుందని అంటున్నారని విమర్శించారు. ఇంకొంత కాలం తర్వాత విద్యుత్ సమస్యకు ప్రజలే కారణమని అంటారని ట్విట్టర్లో ఎద్దేవా చేశారు.
లోకేష్ను కలిసిన టీడీపీ నాయకులు
మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన పలువురు నాయకులు నారా లోకేష్ను శనివారం కలిశారు. హైదరాబాదులో ఆయనను కలిశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని లోకేష్ వారికి సూచించారు.
పెప్సీలో నాయిని ఓటమి
సంగారెడ్డి సమీపంలోని పోతిరెడ్డిపల్లి పెప్సీ (ఆరాధన ఫుడ్స్, జూస్) పరిశ్రమలో కార్మిక సంఘానికి శనివారం జరిగిన ఎన్నికల్లో హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో హిందూ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్), సీఐటీయూలు తలపడ్డాయి. హెచ్ఎంఎస్ నుంచి నాయిని నర్సింహ రెడ్డి పోటీ చేయగా సీఐటీయూ పక్షాన చుక్కరాములు బరిలో నిలిచారు.
ఈ పరిశ్రమలో మొత్తం 269 మంది కార్మికులుండగా, ఒకరు మాత్రం ఆనారోగ్య రీత్యా సెలవులో ఉన్నారు. మిగతా 268 మంది కార్మికులు ఓటింగ్లో పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికలు హెచ్ఎంఎస్, సీఐటీయూలకు సవాల్గా నిలిచాయి. హెచ్ఎంఎస్ నుంచి నర్సింహా రెడ్డి పోటీ చేయడం, సీఐటీయూ పక్షాన ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు తలపడడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
ఉదయం 9.30 గంటల నుంచి పరిశ్రమ ఆవరణలో జరిగిన ఓటింగ్లో హెచ్ఎంఎస్కు 122 ఓట్లు రాగా సీఐటీయూకు 146 వచ్చాయి. 24 ఓట్ల అధిక్యంతో సీఐటీయూ అభ్యర్థి చుక్క రాములు కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు.